ఇప్పుడు మా వంతు – అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక

అమెరికా తన అణుఇంధన స్థావరాలపై చేసిన దాడులు అత్యంత హేయమైనవని, ఇక తామూ ఊరుకోలేమని ఇరాన్ తేల్చిచెప్పింది.

ఇప్పుడు మా వంతు – అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక

అమెరికా దాడులపై ఇరాన్​ తీవ్రంగా స్పందించింది. తమ శాంతియుత అణుఇంధన కేంద్రాలపై చేసిన దాడులకు అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని ఇరాన్​ అత్యున్నత అధినేత అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తీవ్రస్వరంతో హెచ్చరించారు.

అమెరికన్లు ఇంతకుముందెన్నడూ చూడని విధ్వంసాన్ని చూడటానికి సిద్ధంగా ఉండాలని వాషింగ్టన్​కు వార్నింగ్​ ఇచ్చారు. ఈ ప్రకటన ఇరాన్​ ప్రతిఘటనా(Retaliation) తీవ్రతకు అద్దం పడుతోంది. ఎటువంటి కవ్వింపులూ లేకుండా తమపై దాడి చేయడం ఇరాన్​ సార్వభౌమత్వం(Sovereignty)పై యుద్ధం చేయడమేననా ఆయన ప్రకటించారు. తమ ప్రతీకార చర్యలలో భాగంగా, వెంటనే హర్ముజ్​ జలసంధి(Strait of Hormuz)ని మూసివేస్తామని, అమెరికా నావికాదళంపై దాడులు చేస్తామని ఖమేనీ తెలిపారు.

ఖమేనీ ప్రతినిధి హొస్సేన్​ షరియత్​మాదరీ ఆగ్రహావేశాలతో మాట్లాడుతూ, ఇప్పుడు తగిన ప్రతిచర్యలు ఆలస్యం లేకుండా చేపట్టడం ఇక మా వంతని ఒక ప్రకటనలో తెలిపారు. బహ్రెయిన్(Bahrain)​లో మోహరించి ఉన్న అమెరికా నావికాదళాన్ని సమూలంగా నాశనం చేయడానికి క్షిపణి దాడి చేయాలని తమ బలగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పిన ఆయన, హర్ముజ్​ జలసంధిని కూడా వెంటనే మూసేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణా(global oil shipments)కు ఆయువుపట్టులాంటిది. ఇది అన్నిదేశాలపై ప్రభావం చూపించే అవకాశముంది.

కాగా, ఇరాన్​ ప్రకటన అనంతరం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్​, ఇరాన్​ అమెరికాపై ఎలాంటి ప్రతిఘటనాచర్యలకు దిగినా, ఈ రాత్రి చూసిందానికంటే అత్యంత భయంకరమైన అనుభవాన్ని చూస్తారని హెచ్చరించారు.