నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఏపీ పోలీసుల దౌర్జన్యం, కుడికాలువకు నీటి విడుదలపై కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది
విధాత: నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఏపీ పోలీసుల దౌర్జన్యం, కుడికాలువకు నీటి విడుదలపై కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సాగర్ డ్యాం వద్ధ వివాదానికి తెరదించి ఏపీ తన బలగాలను ఉపసంహరించాలని లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
సాగర్ నీరు కావాలని ఏపీ తమను కోరలేదని లేఖలో పేర్కొంది. కుడికాలువకు నీటి విడుదల వెంటనే ఆపాలని ఆదేశించింది. ఏపీకి మూడు విడుతల్లో నీటి విడుదలకు గతంలోనే నిర్ణయం తీసుకున్నామని, దాని ప్రకారం 2024 జనవరి, ఏప్రిల్ లో నీటిని విడుదల చేయాల్సి ఉందని లేఖలో స్పష్టం చేసింది.
కుడికాలువకు ఏపీ పోలీసులు, అధికారులు అక్రమంగా ఐదువేల క్యూసెక్కులు విడుదల చేయడం సరికాదని, ఈ చర్యలను సాగర్ డ్యాంను ఏపీ ఆక్రమించినట్లుగా తెలంగాణ ఆరోపిస్తుందని లేఖలో పేర్కోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, విడుదల విషయంలో ప్రజలు, రైతులకు అన్యాయం జరుగకుండా కేఆర్ఎంబీ పనిచేస్తుందని వెల్లడించింది.
సాగర్ డ్యాం వద్ద యుద్ధ వాతావరణం
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద శుక్రవారం మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కృష్ణానది జల పంపకాలపై ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. డ్యామ్పై తమకు సమాన హక్కులు ఉన్నాయంటూ గురువారం రాత్రి ఏపీ పోలీసులు బలవంతంగా డ్యామ్ మీదకు చొచ్చుకెళ్లిన విషయం తెలిసిందే.
డ్యామ్ 13వ గేటు దగ్గర ముళ్ల కంచె ఏర్పాటు చేయడంతో పాటు.. రైట్ కెనాల్ ద్వారా ఏపీకి నీటిని విడుదల చేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. డ్యామ్కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.
కృష్ణా నీటి పంపకాల విషయం ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి ఉద్రిక్తంగా మారడంతో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సాగర్ నీటి వివాదంపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సాగర్ నీటి పంపకం విషయంలో మరోసారి వివాదం తలెత్తడంతో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక పంపనుంది.
మరోవైపు నాగర్జున సాగర్ డ్యామ్ వద్ద చోటు చేసుకుంటున్న పరిణా మాలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ను డ్యామ్ వద్దకు వెళ్లాలని ఆదేశించారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు నాగార్జన సాగర్ డ్యామ్ వద్దకు వెళ్లనున్నారు.