KTR | తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పట్ల కేంద్రం వివక్ష: కేటీఆర్

KTR పాలమూరు రంగారెడ్డి రెండో దశ అనుమతుల నిరాకరణపై ఆగ్రహం కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగలేఖ విధాత, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పట్ల కేంద్రం వివక్ష పూరిత వైఖరి అవలంభిస్తుందని మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖలో ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుకి రెండవ దశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల […]

  • Publish Date - July 13, 2023 / 03:55 PM IST

KTR

  • పాలమూరు రంగారెడ్డి రెండో దశ అనుమతుల నిరాకరణపై ఆగ్రహం
  • కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగలేఖ

విధాత, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పట్ల కేంద్రం వివక్ష పూరిత వైఖరి అవలంభిస్తుందని మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖలో ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుకి రెండవ దశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున కేంద్రం ఆటంకాలు కల్పిస్తుందని ఆరోపించారు. 9 ఏళ్లుగా తెలంగాణ ప్రగతి ప్రస్థానం పైన అంతులేని వివక్ష ప్రదర్శించిందన్నారు. నదీ జలాల వినియోగం నుంచి మొదలుకొని ప్రాజెక్టుల నిర్మాణం దాకా అన్నింట్లోనూ అడ్డంకులే కల్పించిందన్నారు. 9 ఏళ్లయిన కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా డిమాండ్ ను తేల్చకుండా తాత్సారం చేస్తుందన్నారు.

పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించే విధంగా పలుమార్లు వ్యాఖ్యానించారన్నారు. కేంద్ర సహాయ నిరాకరణ, వివక్ష ఉన్నా… తెలంగాణను ప్రగతి పథంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టామన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎన్ని విధాలుగా అణచివేతకు ప్రయత్నించినా, తెలంగాణ అభివృద్ధి పట్ల మా నిబద్ధతను, సంకల్పాన్ని అడ్డుకోలేరని లేఖలో కేటిఆర్ పేర్కోన్నారు. తెలంగాణ ప్రగతిని, పురోగతిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం, తన పరిధిలో ఉన్న అంశాలను సైతం తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం గత తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నదన్నారు.

తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణం. 12.03 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటిని, ప్రజలకు తాగునీటికి భరోసా అందిస్తూ, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే బహుళార్థక ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయమని లేఖలో కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలు సాగులోకి రావడంతో ప్రాజెక్టు పరిధిలోని కోట్లాది ప్రజల జీవితాల్లో కచ్చితంగా గుణాత్మక మార్పు వస్తుందన్నారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కరువు కాటకాలతో తల్లడిల్లేవని, తాగునీరు లేక నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటే, సాగునీటి సౌకర్యం లేక మహబూబ్ నగర్‌ జిల్లా వలసల పాలయిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథతో నల్లగొండ ఫ్లోరైడ్ రాక్షస భూతాన్ని మా ప్రభుత్వం తరిమికొట్టిందన్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్‌, రంగారెడ్డి జిల్లాలను మరింత సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒకప్పుడు కరువుతో తల్లడిల్లిన ఈ జిల్లాలు పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదు. అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డు తగులుతుందన్నారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ ప్రజల డిమాండ్ ను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం, అనుమతుల పేరుతోనూ అడ్డంకులు సృష్టిస్తున్నదన్నారు. పాలమూరుకు పక్కనే ఉన్న కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదాను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం మొండిచేయి చూపించడం కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనం.

కృష్ణా నీళ్లలో 500 టీఎంసీల వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌ను పట్టించు కోకుండా, కనీసం ట్రిబ్యునల్ కి పంపకుండా 9 సంవత్సరాల తర్వాత కూడా పెండింగ్‌లోనే పెట్టిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే శక్తుల పైన రాజీ లేకుండా పోరాడుతామన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

Latest News