AI Global Summit । సవాళ్లను స్వీకరిస్తాం.. భవిష్యత్తును సృష్టిస్తాం: ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి చెప్పారు. మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందని, విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందని గుర్తు చేశారు.

AI Global Summit । సవాళ్లను స్వీకరిస్తాం.. భవిష్యత్తును సృష్టిస్తాం: ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

AI Global Summit । సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి చెప్పారు. మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందని, విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందని గుర్తు చేశారు. ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ – ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. రెండు రోజుల గ్లోబల్‌ సమ్మిట్‌ గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ చూడటం మన  తరం చేసుకున్న అదృష్టమన్నారు. ఇవాళ ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం నెలకొంటుందని, అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది.. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయా భయం ఉండటం సహజమని పేర్కొన్నారు.

దేశ చరిత్రను పరిశీలిస్తే.. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. భారతదేశ భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే.. హైదరాబాద్‌ సిటీలా మరే సిటీ కూడా పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించిన సవాళ్ళను స్వీకరించడమే కాదు…  భవిష్యత్తును సృష్టిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ AI మిషన్, లేదా NASSCOM భాగస్వామ్యంతో T-AIM తెలంగాణలో AI ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంలో తమ ప్రభుత్వానికి సహకరిస్తాయని తెలిపారు. ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని అన్నారు.

హైదరాబాద్ ను  AI హబ్ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనమని  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ను సిటీ ఆఫ్‌ ఫ్యూచర్‌ అన్న సీఎం.. సిటీ ఆఫ్ ఫ్యూచర్‌కు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. మనమందరం కలిసి ఫ్యూచర్ సిటీని  ఒక గొప్ప AI హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మిట్‌కు మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు.. వివిధ దేశాలకు చెందిన సంస్థల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. “Making AI work for every one” అనే థీమ్తో సదస్సును నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో తొలిసారి ఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తుండటం విశేషం. సమావేశం సందర్భంగా జే పీఏఎల్‌ గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దలివాల్, IBM వైస్ ప్రెసిడెంట్ డానియల్ కాంబ్, యొట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సొల్యూషన్‌ సీఈవో సునీల్‌ గుప్తా తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.ఏఐ రంగం అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చించారు. సమ్మిట్ లో  AI  రోడ్ మ్యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ రోడ్‌మ్యాప్‌లో 25 కార్యక్రమాలను ప్రభుత్వం పొందుపర్చింది.