యూపీఎస్సీ 2023 సివిల్స్ ఫలితాల్లో పాలమూరు జిల్లా అమ్మాయి సత్తా చాటింది. మంగళవారం మధ్యాహ్నం ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో అనన్యారెడ్డి మూడో ర్యాంక్ సంపాదించింది
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : యూపీఎస్సీ 2023 సివిల్స్ ఫలితాల్లో పాలమూరు జిల్లా అమ్మాయి సత్తా చాటింది. మంగళవారం మధ్యాహ్నం ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో అనన్యారెడ్డి మూడో ర్యాంక్ సంపాదించింది.మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన దొనూరు సురేష్ రెడ్డి, మంజుల దంపతుల ఇద్దరు కూతుర్లలో మొదటి కూతురు అనన్య రెడ్డి. ఢిల్లీ లో డిగ్రీ పూర్తి చేసి అక్కడే సివిల్స్ లో శిక్షణ పొంది తొలి సారి యూ పి ఎస్సి పరీక్ష లకు హాజరై ప్రిలిమ్స్ కు ఎంపికై ఇంటర్వ్యూ కు వెళ్ళింది. మొదటి ప్రయత్నం లోనే ప్రిలిమ్స్, ఇంటర్వ్యూ కు వెళ్లిన అనన్య రెడ్డి జాతీయ స్థాయి లో (ఆల్ ఇండియా లెవల్ లో ) మూడో ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వస్తుందని అనుకున్న కాని మూడో ర్యాంక్ వస్తుందని ఊహించలేదని అనన్య రెడ్డి అంటున్నారు. మూడో ర్యాంక్ రావడం ఎంతో సంతోషంగా ఉందని అనన్య రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనన్యా రెడ్డి విద్యాభ్యాసం :
యూపీఎస్సీ – 2023 సివిల్స్ పరీక్షా ఫలితాల్లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి పాఠశాల విద్య అంతా పాలమూరు పట్టణంలో జరిగింది. 6 నుంచి పదో తరగతి వరకు పాఠశాలలో చదువు కొనసాగించారు. పదో తరగతి పరీక్ష ల్లో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్స్ సాధించింది. తరువాత హైదరాబాద్ లోని నారాయణ కాలేజీ లో ఐఏఎస్ అకాడమీలో ఇంటర్ పూర్తి చేసి… ఢిల్లీలోని మిరండా హౌస్ లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ అనంతరం యూపీఎస్సీ పరీక్షలకు అక్కడే కోచింగ్ తీసుకుంది. మొదటి ప్రయత్నంలోనే తన లక్ష్యాన్ని సాధించింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన అనన్య రెడ్డి సివిల్స్ లో ఎంపిక కావడం జిల్లా కే పేరు తెచ్చి పెట్టింది. అనన్య ప్రతిభను జిల్లా విద్యావేత్తలు కొనియాడుతున్నారు. ప్రస్తుతం అనన్యా రెడ్డి కుటుంబం పాలమూరు జిల్లా కేంద్రం లోని వెంకటేశ్వర కాలనీ లో నివాసం ఉంటున్నారు.