• Telugu News
  • /Latest

Maharashtra | 4 నెలలు తినకపోతే ఏమీకాదు?.. ఉల్లిపాయలపై మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్య

Maharashtra | ఉల్లి ఎగుమతులపై 40% సుంకం విధింపు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు.. వేలం బంద్‌ నాసిక్‌: మూడునాలుగు నెలలు ఉల్లిపాయలు తిననంత మాత్రాన ఏమీ జరగదని మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి దాదా భూసే (Minister Dada Bhuse) అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిపై 40శాతం సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, వ్యాపారులు చేస్తున్న ఆందోళనలకు ఆయన పై విధంగా స్పందించడం వివాదాస్పమైంది. రానున్న పండుగల సీజన్‌ నేపథ్యంలో దేశంలో ఉల్లిపాయల […]

Reported by: Somu | latest | IST
Read Time: 3 mins
Maharashtra | 4 నెలలు తినకపోతే ఏమీకాదు?.. ఉల్లిపాయలపై మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్య

Maharashtra |

హైలైట్స్:

  • ఉల్లి ఎగుమతులపై 40% సుంకం విధింపు
  • నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు.. వేలం బంద్‌

నాసిక్‌: మూడునాలుగు నెలలు ఉల్లిపాయలు తిననంత మాత్రాన ఏమీ జరగదని మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి దాదా భూసే (Minister Dada Bhuse) అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిపై 40శాతం సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, వ్యాపారులు చేస్తున్న ఆందోళనలకు ఆయన పై విధంగా స్పందించడం వివాదాస్పమైంది. రానున్న పండుగల సీజన్‌ నేపథ్యంలో దేశంలో ఉల్లిపాయల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19న 40శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే.

ఉల్లిపాయల ఎగుమతిపై సుంకం విధించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. ‘పది లక్షలు పెట్టి కొన్న వాహనం ఉపయోగించేవారు పదో ఇరవయ్యో ఎక్కవ పెట్టి ఉల్లిపాయలు కొనుగోలు చేయగలుగుతారు. కొనలేని వారు మూడు నాలుగు నెలలు ఉల్లిపాయలు తినకపోయినా ఏమీ కాదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే.. ఉల్లిపాయల ఎగుమతిపై సుంకం విధించే నిర్ణయం తగిన సమన్వయంతో తీసుకుని ఉండాల్సిందని చెప్పారు. ‘కొన్ని సమయాల్లో ఉల్లిపాయలు క్వింటా రూ.200 పలుకుతాయి. మరి కొన్ని సార్లు క్వింటా రూ.2000 పలుకుతాయి. చర్చలు జరిపి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనవచ్చు’ అని అన్నారు.

అంతకు ముందు నాసిక్‌తోపాటు.. దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల మార్కెట్‌ అయిన లాసల్‌గావ్‌లలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో ఉల్లి వేలాన్ని నిరవధికంగా నిలిపివేయాలని వ్యాపారులు నిర్ణయించా రు. కేంద్ర ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే వరకూ వేలం నిర్వహించవద్దని నాసిక్‌ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం పిలుపునిచ్చింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు, వ్యాపారులు కేంద్రం విధించిన సుంకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.