విధాత‌: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా కార్ల ధరలు పెరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి ఒకటో నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నట్లు తెలుస్తున్నది. భారత్‌లో విక్రయించే అన్ని ఎస్‌యూవీ కార్లను ధరలను పెంచాలని మహీంద్ర కంపెనీ భావిస్తున్నది. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి సరుకు ధరల పెరుగుదల నేపథ్యంలో కార్ల ధరలను పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.


అన్ని మోడల్స్‌పై పెంచుతుందా..? లేదంటే ఎంపిక చేసిన మోడల్స్‌పై ధరలు పెంచబోతున్నదా? తెలియాల్సి ఉన్నది. ఇప్పటికే పలు కార్ల తయారీ కంపెనీలు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మారుతి సుజుకీ సైతం ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు పెరుగడంతో వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి భారత్‌లో కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. అలాగే, టాటా మోటార్స్‌, ఆడి కంపెనీ సైతం ధరలను పెంచబోతున్నట్లు తెలిపాయి.


దేశంలో వాహన తయారీ కంపెనీలు సాధారంగా ప్రతి ఏటా ఒకటి లేదా రెండుసార్లు ధరలు పెంచుతుంటాయి. కొన్నిసార్లు ఎంపిక చేసిన మోడల్స్‌పై ధర పెంచుతూ రాగా.. మరికొన్నిసార్లు లైనప్‌లోని అన్ని కార్ల ధరలను పెంచుతుంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు, ముడి సరుకు ధరలు, కంపెనీ సేల్స్‌ ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాయి. వాటిని విశ్లేషించి ఎంత మేరకు ధరలను పెంచాలనే విషయం నిర్ణయం తీసుకుంటుంది.