Manchiryala జాతీయ పతాకం ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ విధాత: తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన దశాబ్ది వేడుకల్లో ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి , జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి పూల మాల వేసి […]
Manchiryala
విధాత: తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన దశాబ్ది వేడుకల్లో ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి , జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
అనంతరం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. స్వయం పాలన కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన రణంలో ప్రతి ఒక్కరు కదం కలిపారు… ఉద్యమ గొంతుకలై…. జై తెలంగాణ అంటూ నినదించారు. నాటి తెలంగాణ ఉద్యమంలో చోటు చేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు ఉద్యమానికి ఊపిరి పోశాయి…. ఉద్యమంలో కీలక మైలురాళ్లు ఎన్నెన్నో ఉన్నాయని అన్నారు.
స్వరాష్ట్రమైన తెలంగాణ తొమ్మిదేండ్ల కాలంలో అద్భుతాల సమాహారంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. పాలనలో బంగారు తెలంగాణ అత్యద్భుత కట్టడాలకు నెలవైంది. ఒకటా రెండా, మునుపెన్నడూ చూడని అద్భుత నిర్మాణాలు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నాయి.
సొంత రాష్ట్రంలో సబ్బండ వర్ణాల సమగ్ర జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి కె.సి.ఆర్. సంక్షేమ అభివృద్ధి యజ్ఞం చేస్తున్నారు.. ఒక పేద కుటుంబం సమగ్రంగా మెరుగైన జీవితం గడిపేందుకు భరోసానిస్తూ అనేక పథకాలతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు .
అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో వినూత్న పద్ధతుల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకుందాం. ప్రజా సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. “తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది” అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కళాబృందాలకు ప్రశంసా పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, జిల్లా అధికారులు, బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.