Medak
- ఎస్పీ కార్యాలయం ఎదుట రాస్తా రోకో..
- ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డగింతకు యత్నం..
- డి ఎస్పీతో వాగ్వివాదం..
విధాత, మెదక్ బ్యూరో: రైన్ రిజిస్ట్రేషన్ పేరుతో పట్టా భూములను కుదువ పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకొని దళిత రైతుల భూములను కాజేసిన వ్యక్తులను అరెస్టు చేయాలని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో చేగుంట మెదక్ రహదారి ఎస్పీ కార్యాలయం సమీపంలోని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ ను అడ్డగించే ప్రయత్నం చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ సిఐ, ఎస్ఐలు ఎమ్మార్పీఎస్ నేతలను అడ్డుకున్నారు. వారికి సర్ది చెప్పి నా ఎస్పీ కార్యాలయం ముందే ఆందోళన కొనసాగించారు.
దీంతో డిఎస్పికి దళిత సంఘాల నేతలకు వాగ్వాదం జరిగింది. అవుసులపల్లి, శంనాపూర్ గ్రామాలకు చెందిన 5 గురు దళిత రైతులకు సంబంధించిన భూములు, మెదక్ లో ప్రముఖ డాక్టర్, ఇటీవల ఆత్మ హత్య చేసుకున్న వ్యక్తి సతీమణి, వారీ అనుచరులు ఈ తతంగానికి పాల్పడ్డారని, వారిని అరెస్ట్ చేయాలని బాధిత రైతులతో కలిసి ఆందోళనకు దిగిన దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దళిత భూములను రైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింతకు యత్నం..
ఎస్పీ కార్యాలయం ఎదుట రహదారిపై రాస్తారోకో చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రూరల్ గ్రామాలలో కార్యక్రమాలను ముగించుకొని మెదక్ వస్తుండగా ఆందోళన చేస్తున్న దళిత సంఘాల నేతలు కారును అడ్డగించే యత్నం చేశారు. అక్కడే ఉన్న డిఎస్పీ ఫణీంద్ర, సిఐ వెంకటేశం, యస్ ఐ లింగం పోలీసులు దళిత సంఘాల నేతల ను అడ్డుకొని డి ఎస్పీ కార్యాలయానికి తరలించారు.
పూర్తి విచారణ జరుపుతామని డిఎస్పీ ఫణీంద్ర తెలిపారు. సమాచారం లేకుండా ఆందోళన చేయడాన్ని డిఎస్పీ తప్పు పట్టారు. ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు బాలరాజ్, డి బి ఎస్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్ లక్ష్మణ్ ఇసాక్ లద్దరాజు పాతూరి రాజు, శమనాపూర్ సర్పంచ్ లింగం, మురళి, లద్ద నర్సింలు, బాధిత రైతులు పాల్గొన్నారు.