అసంపూర్తి పనులతో భక్తుల అవస్థలు రూ.2.82 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రతి ఏటా ఇదే పరిస్థితి అని ఆవేదన అయినా అధిక సంఖ్యలో భక్తుల రాక విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వేలాదిగా తరలివస్తున్న సమ్మక్క సారలమ్మ భక్తుల కోలాహలంతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి. పూనకాలతో మేడారం గద్దెలు, జంపన్న వాగు పరిసరాలు హోరెత్తుతున్నాయి. ఈనెల ఒకటవ తేదీన ప్రారంభమైన మినీ మేడారం జాతరకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. రెండేళ్లకోసారి జాతర భారీ […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వేలాదిగా తరలివస్తున్న సమ్మక్క సారలమ్మ భక్తుల కోలాహలంతో మేడారం పరిసరాలు జనసంద్రంగా మారాయి. పూనకాలతో మేడారం గద్దెలు, జంపన్న వాగు పరిసరాలు హోరెత్తుతున్నాయి. ఈనెల ఒకటవ తేదీన ప్రారంభమైన మినీ మేడారం జాతరకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.
రెండేళ్లకోసారి జాతర భారీ స్థాయిలో నిర్వహించగా మధ్యలో సంవత్సరం తమ సంప్రదాయం ప్రకారం మేడారం జాతరను గిరిజనులు తమ శక్తి మేరకు నిర్వహిస్తుంటారు. దీనిని మినీ మేడారం జాతరగా పేర్కొంటారు. ఈ ఏడాది జరుగుతున్న మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నప్పటికీ తగిన వసతులు కల్పించడంలో దేవాదాయ శాఖ, ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జాతర తేదీలు ముందుగానే ప్రకటించినప్పటికీ అధికారులకు ఈ విషయం తెలిసి కూడా నిధుల విడుదలలో జాప్యం చేశారు. పనులు చేపట్టడంలో ఆలస్యం ఫలితంగా జాతర సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతులు పూర్తి కాకుండా పోయాయి. జాతర ముగిసే దశకు చేరుకుంటున్నా పనులు పూర్తి కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.2.82 కోట్లతో అభివృద్ధి పనులు
జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.2.82 కోట్లతో తాగునీరు, మరుగుదొడ్లు, జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు, విడిది గృహాలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, పోలీసు బందోబస్తు తదితర పనులకు కేటాయించినప్పటికీ సకాలంలో పనులు పూర్తికాలేదని స్థానికులు విమర్శించారు. కొన్ని ప్రాథమిక పనులు మాత్రం పూర్తి చేసినట్లు చెబుతున్నారు.
మంత్రి ఆదేశించినా మారని తీరు
మినీ మేడారం జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత అధికారులను నెలరోజుల ముందు ఆదేశించినా పెద్దగా ఫలితం దక్కలేదు. అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే అనే తీరుగా ఉన్నాయి. ఈ మినీ మేడారం జాతరకు నాలుగు నుండి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని, రూ.2 కోట్ల 82లక్షల నిధులు మంజూరు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మంత్రి హామీ పూర్తిగా అమలుకు నోచుకోలేదు.
ప్రతీ ఏటా జరిగే తంతు ఇదే
ప్రతి ఏటా మేడారం జాతర సందర్భంగా ఇదే తంతు కొనసాగుతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జాతర హడావుడిలో, వనదేవతలను సందర్శించుకోవాలనే ఆత్రుతతో భక్తులు తమ ఇబ్బందులను పట్టించుకోవడంలేదు. పనులలో నాణ్యత లోపమే కాకుండా అసంపూర్తిగా పనులు చేసి కాంట్రాక్టర్లు దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. దీని ఫలితంగా భక్తులు అసౌకర్యాల మధ్యనే వనదేవతలను సందర్శించుకుని తిరుగు ముఖం పడుతున్నారు.
గతంతో పోలిస్తే జాతర లేని సమయంలో కూడా మేడారం పరిసరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్, సెలవు రోజుల్లో మేడారం సందర్శించే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని మేడారం వచ్చే భక్తులకు శాశ్వత సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
సంప్రదాయ పద్ధతిలో మేడారం జాతర
ఆదివాసుల ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మల మినీ మేడారం జాతర బుధవారం మండ మెలిగే ప్రతేక్య పూజతో మొదలైంది. శనివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. సాధారణంగా మినీ మేడారం జాతర నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. సంవత్సరం తర్వాత మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మండ మెలిగే పండుగను మినీ జాతరగా చేయడం ఆనవాయితీగా వస్తుంది.
ఈ మేరకు మేడారంలోని సమ్మక్క గుడి, కన్నేపల్లిలోని, సారలమ్మ గుడి, గోవిందరాజులు గుడి, పగిడిద్ద రాజుల గుళ్ళలో గంగా జలంతో శుద్ధిచేసి వనదేవతలకు సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గ్రామదేవతలైన బొడ్రాయి, ఎర్రమ్మ, పోచమ్మ, పోతురాజులకు ప్రత్యేక పూజలు చేసి రక్షణ కోసం గ్రామానికి ఇరువైపులా బూరుగు చెట్లను ధ్వజ స్తంభాలుగా నిలిపి, మామిడి ఆకుల తోరణాలతో రక్షాబంధన్ చేశారు.
బయ్యక్కపేటలో జాతర సంబురం..
బయ్యక్కపేటలోని సమ్మక్క పుట్టింట జాతర సంబురం నెలకొంది. చందా వంశీయుల ఆధ్వర్యంలో తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పరిసర గ్రామాల ప్రజలు తల్లిగద్దెకు చేరుకొని ముడుపుకట్టి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో వంటలు చేసుకొని విడిది చేశారు.
మొక్కలు సమర్పించుకున్న భక్తులు
హనుమకొండ బస్టాండు నుంచి ఆర్టీసీ మేడారానికి ప్రత్యేక బస్సులు నడిచాయి. బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలలో భారీ సంఖ్యలో భక్తుల మేడారం చేరుకోవడంతో జన సంద్రంగా మారింది. సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకోవడానికి తెలంగాణతో పాటు చత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి భక్తులు వచ్చారు. ముందుగా జంపన్నవాగులో స్నానాలను ఆచరించి అనంతరం కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుకుని తర్వాత సమ్మక్క, సారలమ్మ గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలకు వారు చేరుకున్నారు.
శివసత్తుల పూనకాలతో డోలు వాయిద్యాల మధ్య చేరుకుని గద్దెలకు పూలుపండ్లు, పసుసు కుంకుమ, చీరెసారె, కొబ్బరికాయలు, బెల్లం సమర్పించి, మొక్కులను చెల్లించుకున్నారు. వనదేవతలకు గిరిజన పూజారులైన వడ్డెల పూజలు చేశారు. శనివారంతో జాతర ముగియనున్నందున భక్తులు భారీగా వనదేవతలను దర్శించుకుంటున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క వనదేవతలను సందర్శించి మొక్కులు సమర్పించుకున్నారు. మేడారంలో మొక్కులు సమర్పించుకున్న వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు.