Meeting of ‘India’
- సభలో సమన్వయంపై చర్చ
- ఖర్గే ఆఫీసులో సమావేశం
న్యూఢిల్లీ: ‘ఇండియా’ పేరిట కొత్తగా ఒక వేదికపైకి వచ్చిన ప్రతిపక్షాల కూటమి పార్లమెంటరీ పార్టీల నాయకులు సోమవారం సమావేశం కానున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో.. పార్లమెంటులో ప్రతిపక్షాల సమన్వయం అంశంపై చర్చించనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
మణిపూర్ అంశంపై పార్లమెంటు ఆవరణలోని మహాత్ముని విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో ప్రతిపక్ష నేతలు ఉన్నట్టు సమాచారం. గురువారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో మణిపూర్ అంశం ప్రధానంగా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించాలని ప్రతిపక్షం పట్టబడుతుంటే.. స్వల్ప కాలిక చర్చకే కేంద్రం మొగ్గు చూపుతున్నది.
ఈ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంటులో ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై అధికార, ప్రతిపక్షాల వాదోపవాదాల మధ్య రెండోరోజు సమావేశాలు వాయిదాలకు దారి తీసిన విషయం తెలిసిందే.
మణిపూర్ అంశంపై ఉభయ సభల్లో చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే.. దీనికి హోంమంత్రి సమాధానమిస్తారని తెలిపారు. 17వ లోక్సభ 12వ సెషన్ ప్రత్యేక పరిస్థితుల్లో నడుస్తున్నది.
ఒకవైపు 26 ప్రతిపక్ష పార్టీలు ఐఎన్డీఐఏ పేరుతో కూటమిగా ఏర్పడగా.. అధికార బీజేపీ.. తన పాత మిత్రులను, కొత్తవారిని కలుపుకొని ఎన్డీయేను మళ్లీ రంగంలోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో దేశానికి సంబంధించిన కీలక అంశాలపై సమన్వయంతో ముందుకు వెళ్లాలని, నిర్మాణాత్మక పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రతిపక్షాల మధ్య మరింత సమన్వయం కోసం కూటమి నాయకులు సోమవారం జరిగే సమావేశంలో చర్చించి, వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.