NCERT మూలవాసులు ద్రావిడులు కాదని చెప్పే కుట్ర ఆర్యులు స్థానికులని చూపేందుకు తహతహ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2021 సంవత్సరం నుంచి చరిత్ర పాఠ్యాంశాలలో అనేకమైన మార్పులు తీసుకుని వచ్చింది. చరిత్ర పాఠ్యాంశాలు(NCERT) మార్చడం వెనక పాలకుల పక్షపాత ఆలోచన విధానాలు దాగి ఉన్నాయి. చరిత్రను శాస్త్రీయ ఆధారాల నుంచి కాకుండా నిరాధార పురాణాల నుంచి పునర్ నిర్మించాలని చేస్తున్న ప్రయత్నమిది. ప్రపంచ చరిత్రలో అన్ని దేశాలలో చరిత్రను, మైథాలజీని వేరువేరుగా చూస్తారు. మనదేశంలో మైథాలజీని చరిత్రగా […]
NCERT
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2021 సంవత్సరం నుంచి చరిత్ర పాఠ్యాంశాలలో అనేకమైన మార్పులు తీసుకుని వచ్చింది. చరిత్ర పాఠ్యాంశాలు(NCERT) మార్చడం వెనక పాలకుల పక్షపాత ఆలోచన విధానాలు దాగి ఉన్నాయి. చరిత్రను శాస్త్రీయ ఆధారాల నుంచి కాకుండా నిరాధార పురాణాల నుంచి పునర్ నిర్మించాలని చేస్తున్న ప్రయత్నమిది. ప్రపంచ చరిత్రలో అన్ని దేశాలలో చరిత్రను, మైథాలజీని వేరువేరుగా చూస్తారు. మనదేశంలో మైథాలజీని చరిత్రగా బుకాయిస్తూ ఇంత కాలం ప్రచారం చేస్తూ వచ్చినారు. ఇప్పుడు ఏకంగా పాఠ్య పుస్తకాల్లోకి, చరిత్ర పాఠ్యాంశాలలోకి వాటిని చొప్పించి విద్యార్థులపై అవాస్తవాలను రుద్దుతున్నారు. చరిత్ర సిలబస్ లోని 12 పేపర్లలో ఇదే పద్ధతిని పాటించారు.
దేశ మూలవాసులు ద్రావిడులు కాదని చెప్పే కుట్ర
ఒక ఉదాహరణతో మొదలుపెడదాం. చరిత్రను మైథాలజీని ఏ విధంగా కలగాపులగం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. వాస్తవాలను తొలగించి, ఆధారాలు లేని ఫిక్షన్స్ను చరిత్రగా ప్రతిక్షేపించే ప్రక్రియను ప్రవేశపెట్టినారు. మన దేశ చరిత్రలో ప్రధానంగా చెప్పుకోదగినది సింధులోయలో వెల్లివిరిసిన హరప్పా నాగరికత. ఈ నాగరికతనుండే భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.
ఇండస్-హరప్పా నాగరికత పేరును మార్చేసి ఇండస్-సరస్వతీ నాగరికతగా రూపాంతరం చెందించడం ద్వారా ఈ దేశంలో ద్రావిడుల ఉనికిని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులను స్థానికులుగా చూపించే ప్రయత్నంలో భాగంగా హరప్పా పేరును తొలగించారు. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చి స్థిరపడిన జాతి అనే అంశాన్ని పూర్తిగా మార్చివేసి, చారిత్రక ఆధారాలు లేని అంశాలను ప్రవేశపెట్టినారు.
ఆర్యుల జన్మస్థానం భారతదేశమని, ఆర్యులు భారతదేశంపై దండెత్తి రావడం అబద్ధమని, ఆర్యుల నాగరికత ఇలా ఆర్యుల పైన ఆర్య జాతి పైన వల్ల మాలిన అభిమానాన్ని ప్రదర్శిస్తూ పాఠ్యాంశాలు చేర్చడం జరిగింది. తద్వారా ఈ దేశ మూలవాసులు ద్రావిడులు కాదని చెప్పే కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. ద్రావిడులను ఇప్పటికే దక్షిణ భారత ప్రాంతపు వారీగా ముద్ర వేసినారు.
ఈ విషయంలో వారు కొంతవరకు కృతకృత్యులైనారు. హిందీ భాష కాకుండా దక్షిణ భారత భాషలు మాట్లాడే ప్రాంతాలు మాత్రమే ద్రవిడులు నివసించిన ప్రాంతాలుగా ముద్ర వేసినారు. హరప్పా నాగరికత నుంచి హరప్పా పేరును తీసివేసి సరస్వతి పేరు పెట్టడం ద్వారా ద్రావిడ మూలాలనే పూర్తిగా తొలగించాలనే దురుద్దేశం దాగి ఉన్నది.
ఊహాజనిత చరిత్రను ప్రతిక్షేపించే ప్రయత్నాలు
చరిత్ర అధ్యయనంలో అనేక మార్పులు వచ్చినాయి. చరిత్ర అంటే ఒకప్పుడు రాజులూ రాచరిక ప్రభుత్వాల గొప్పతనంగా భావించే రోజులు పోయినాయి. ఇప్పుడు చరిత్ర అధ్యయనమంతా ఆయా కాలమాన పరిస్థితుల్లో ప్రజల జీవన శైలి,సంస్కృతి,కళలు, జీవన ప్రమాణాలు, ఆహారపు ఉత్పత్తులు, అభివృద్ధి చేసిన విజ్ఞాన శాస్త్రం, పరిణామ క్రమంలో వచ్చిన అధునాతన మార్పులు, వివిధ సమూహాలుగా ఉన్న జాతులు, వారి వైవిద్య జీవనం, పరిపాలన విధానంలో వచ్చిన నూతన మార్పులు మొదలైనవి.
చరిత్ర ద్వారా అధ్యయనం చేస్తాం. దీనికి బదులుగా రాజు ఏమతానికి చెందిన వాడు అనే ప్రాతిపదిక తీసుకోవడం అనేది అర్థం లేనిది. చరిత్ర గడిచిన కాలానికి సజీవ సాక్ష్యం. అది ప్రజల అనుభవ జీవనం, పరిపాలన సారం. దీన్ని మనం తొలగిస్తున్నామంటే మన చరిత్రను మనమే రద్దు చేసుకుంటున్నట్టు. అట్లా రద్దు చేసిన చరిత్ర స్థానంలో ఊహాజనిత ఆధార రహిత, పరిశోధనా పరిశీలన రహిత చరిత్రను ప్రతిక్షేపించడం ద్వారా ఈ సమాజాన్ని అంధకారంలోకి నెట్టాలనే ప్రయత్నం జరుగుతున్నది.
ఆరు పేపర్ల మొగలుల చరిత్ర ఒక పేపర్కు
ఇక మొగల్ పరిపాలనా కాలానికి సంబంధించిన చరిత్ర పాఠ్యాంశాలను తీసివేయడం అనేది మతకోణంలో నుంచి పరిశీలింపదగిన విషయం కాదు. డిగ్రీ స్థాయిలో 6 పేపర్లలో ఉన్న మొగలుల చరిత్ర ను ఒకే పేపర్ కుదించడం ద్వారా జరగబోయే ప్రమాదం ఏమిటంటే 700 సంవత్సరాల దేశ చరిత్ర కోల్పోతాము. ఆధునిక రాజ్యాలు ఏర్పాటవుతున్న కాలంలో భారతదేశానికి చరిత్రనే లేదని పరిస్థితిని కల్పించబోతున్నారు.
చరిత్రను ఎప్పుడు ప్రజల కోణంలో చూడవలసి ఉంటుంది. ఏ రాజు పరిపాలించినా చరిత్ర పొడవునా ప్రజల జీవన విధానమే ఉంటుంది. ఆ కాలంలో వారి సంస్కృతి, ఆహార వ్యవహారాలు, పరిపాలన సంబంధమైన అంశాలు, వివిధ వృత్తులు, వ్యవసాయంలో వారు పాటించిన పద్ధతులు, శాస్త్ర విజ్ఞానం, భిన్నత్వానికి వైవిధ్యానికి ప్రతిరూపంగా ఉన్న భారతదేశంలో వారంతా ఎలా కలిసి ఉన్నారనేది చరిత్ర నమోదు చేస్తుంది.
పరిపాలించిన రాజుల మతాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కాలంలో జరిగిన గొప్ప మార్పులను కనుమరుగు చేస్తే, మన దేశపు గొప్పతనం భావితరాలు అర్థం చేసుకునే అవకాశం ఉండదు. 17వ శతాబ్దంలో యూరోప్ దేశాల కంటే భారతదేశం ధనవంతమైన దేశం. దాని కారణాలు అప్పటి పరిపాలన వ్యవస్థలో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక ఉత్పత్తుల్లో 20% కు పైగా మన దేశపు వాటా ఉండేది. పారిశ్రామిక విప్లవానికి ముందు భారతదేశం పశ్చిమ దేశాల కంటే ముందు ఉన్నది.
భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం అనేది ఆనాటి పాలకులు అమలు చేసిన పరిపాలన విధానాల ద్వారా సాధ్యమైంది. నాణాలను చలామణీ లోకి తేవడం, నీటి పారుదల వ్యవస్థను పటిష్టం చేయడం, పరిపాలన విధానాల్లో ఆధునిక మార్పులు తీసుకురావడం ద్వారా భారతదేశాన్ని యూరోప్ దేశాల కంటే పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందించగలిగారు.
NCERT | దేశ చరిత్రపై కాషాయ కత్తి.. పాఠ్యాంశాల నుంచి కీలక అంశాల తొలగింపు
మతకోణంలో చరిత్రను పునర్లిఖించే యత్నం
అక్బర్ పరిపాలన కాలాన్ని చరిత్ర నుంచి తీసివేయడం వల్ల, ఆ కాలంలో ఆయన ప్రవేశపెట్టిన శాంతియుత జీవనం, రాజపుత్రులతో కలిసిపోవడం, పూర్వ ఆధునిక పరిపాలన విధానాలు, దేశవ్యాప్త సర్వే, వ్యవసాయ రంగంపై చేసిన కృషి ఇలా అనేక అంశాలు ఉద్దేశపూర్వకంగా విద్యార్థులకు చేరకుండా చేశారు. అక్బర్ కాలంలో జరిగిన సామాజిక అభివృద్ధిని ప్రస్తావించినప్పుడు అవి ప్రవేశపెట్టిన రాజు పేరును తొలగించడం చరిత్రను రాసే పద్ధతికి విరుద్ధం. మతకోణంలో చరిత్రను పునర్లిఖించడం అంటే ఆధునిక భారతదేశాన్ని మళ్లీ మధ్యయుగంలోకి తీసుకెళ్లడమే.
కండ్లముందు జరిగినవీ తీసేశారు
ఆధునిక భారతదేశంలో స్వాతంత్రానికి ముందు తర్వాత జరిగిన భారతదేశ చరిత్రలో ముఖ్య సంఘటనలు తీసివేసినారు. 70 సంవత్సరాలు పైబడిన వారి కళ్ళ ముందు జరిగిన చరిత్రను పాఠ్యాంశాలలో లేకుండా తీసేసినారు. మహాత్మా గాంధీ అహింసా పద్ధతి ద్వారా నిర్వహించిన ఉద్యమాలని,ఆయన ప్రతిపాదించిన అహింస జీవనం,సర్వమత సహనం లాంటి ఆధునిక భావనలను ప్రపంచం మొత్తం స్వీకరించింది.
ఆధునికన భారత నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన సోషలిజం అనే సామాజిక అభివృద్ధి ఫార్ములాలను, భారతదేశంలో పరిశ్రమలు,వ్యవసాయం,విజ్ఞానం అభివృద్ధి కోసం ముందు చూపుతో ఆయన వేసిన బాటలు, మిశ్రమ ఆర్థిక విధానాలను అవలంబించడం ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన విషయాలు తొలగించి వేసినారు.
సంఘసంస్కర్తలైన రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారి కృషిని వారు హిందూ వివాహ చట్టాన్ని రూపొందించే వరకు చేసిన సంఘసంస్కరణ ఉద్యమాన్ని కనుమరుగు చేసినారు. మనదేశంలో కుల వ్యవస్థ పైన,సాంఘిక దురాచారాల పైన జరిగిన ఉద్యమాల్ని కూడా తొలగించి వేసినారు.
నిజమైన చరిత్రను చెరిపివేసే కుట్ర
ఇక్కడ చరిత్ర పుస్తకాలు మార్చిన రాసినారు అంటే ఒక ముస్లిం రాజుల చరిత్రను మాత్రమే తగ్గించినారు అని అనుకుంటే పొరపాటు. మన దేశంలోని ప్రజల నిజమైన చరిత్రను తుడిచి వేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇక్కడి సమాజంలో ప్రజలు వందలాది సంవత్సరాలుగా సమానత్వం సౌభ్రాతృత్వం కోసం పోరాడి సాధించుకున్న హక్కులు, ఉద్యమ విజయాలకు, సమానత్వం ప్రాతిపదికన సాగిన సంఘసంస్కరణలను,విభిన్న మతాల, జాతుల, తెగల వారు ఈ దేశ నిర్మాణంలో ఆర్థిక సంపద సృష్టించడంలో,సంస్కృతి,కళలు,విజ్ఞానం మొదలైనవాటిని ఉన్నతీకరించడంలో చేసిన కృషి తొలగించబడింది.
ఇలా ఒక్కటేమిటి మన నిజమైన చరిత్రను మనది కాకుండా చేసే ప్రయత్నం జరుగుతున్నది. మన చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించారంటే మన భవిష్యత్తుకు,మన అస్తిత్వానికి ముప్పు వాటిలినట్టే. నిజమైన, శాస్త్రీయ ఆధారాలు ఉన్న చరిత్రను తెలుసుకునే హక్కు మనకున్నది. ప్రభుత్వాలన్నీ భారత రాజ్యాంగం పరిధిలో పనిచేయాల్సి ఉంది. ఒక మతానికో,కులానికో,ఒక వాదానికో మద్దతు పలకరాదు. ప్రభుత్వాలు ఎప్పుడూ శాస్త్రీయంగా ఆలోచించాలి. ఆధునికంగా ప్రజల్ని ముందుకు నడిపించాలి. కానీ వాస్తవంలో ఇప్పుడు జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉంది.
మూఢత్వభావంలోకి, మధ్యయుగపు కాలానికి,మనస్తత్వానికి దేశ ప్రజలను తిరోగమింపజేయడం భవిష్యత్తు భారతదేశానికి ప్రమాదకరం. మనిషి ఆదిమ కాలం నుండి ఆధునిక యుగానికి సాగించిన ప్రయాణాన్ని, జీవన వైవిధ్యాన్ని,వివిధ దశల పరిణామ క్రమాన్ని, అభివృద్ధి దశలలో మైలురాళ్లుగా నమోదు చేసిన వాస్తవిక అంశాలను చరిత్ర రూపంలో అధ్యయనం చేస్తాం. దీనికోసం చరిత్రను చదువుతాం. వ్యక్తుల ప్రాతిపదికగా చరిత్రను చూడటం జరగదు. ఆయా కాలాల్లో ఆ వ్యక్తులు, వ్యవస్థలు ప్రతిపాదించిన, ఆచరించిన మెరుగైన పద్ధతులను భవిష్యత్తు సమాజం కొనసాగిస్తుంది. అది మానవజాతి ఉమ్మడి ఆస్తిగా ఉంటుంది. ఈ ఉమ్మడి ఆస్తిని మన నుండి దూరం చేసే హక్కు ఎవరికీ లేదు.
– ఎర్రోజు శ్రీనివాస్
NCERT | దేశ చరిత్రపై కాషాయ కత్తి.. పాఠ్యాంశాల నుంచి కీలక అంశాల తొలగింపు