Nirmala Sitharaman |

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడేనన్న మంత్రి

విధాత: జనంలోకి వెళ్లిన రాజకీయ నాయకులకు అప్పడప్పుడు కొన్న షాక్‌లు తగులుతుంటాయి. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమలాల్సి వస్తుంది కూడా! దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న నిర్మలా సీతారామన్‌కు తమిళనాడులో ఇటువంటి గడ్డు పరిస్థితే ఎదురైంది.

2024 ఎన్నికల ప్రచారాన్ని తమిళనాడులో అప్పుడే ప్రారంభించేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman).. కాంచీపురం జిల్లా పళైయీసీవరం అనే గ్రామంలో కేంద్ర సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌తో కలిసి.. ఇంటింటికి తిరిగారు. అందరినీ పలకరించారు.

ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అన్నీ చేరుతున్నాయా? అని వాకబు చేశారు. బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతూ తిరుగుతుంటే ఒక చోట కొందరు మహిళలు ఆమెను చుట్టుముట్టారు. గ్యాస్‌ ధరలు పెరిగిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, దయచేసి గ్యాస్‌ ధర (cooking gas price) తగ్గించేలా చూడాలని విన్నవించారు.

అప్పటిదాకా ప్రభుత్వం గొప్పతనం వివరించిన నిర్మలమ్మ.. ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. ఏం చెప్పాలో పాలుపోక.. గ్యాస్‌ ధర అంతర్జాతీయ మార్కెట్‌ ఆధారంగా నిర్ణయమవుతుందని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని తేల్చి చెప్పేశారు.

‘మన దేశంలో వంటగ్యాస్‌ దొరకదు. మనం దానిని దిగుమతి చేసుకోవాల్సిందే. మనం దిగుమతి చేసుకునే సమయంలో ధరలు పెరిగితే ఇక్కడ కూడా ధరలు పెరుగుతాయి. అక్కడ ధరలు తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతాయి. కానీ.. రెండేళ్లుగా గ్యాస్‌ ధర అక్కడ తగ్గడం లేదు’ అని వివరంగా చెప్పేసి.. హమ్మయ్య అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.