Kamareddy BJP Congress Clashes| కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య దాడులు.. ఉద్రిక్తత
కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య పరస్పర దాడులతో కామారెడ్డి పట్టణం అట్టుడికిపోతుంది. కామారెడ్డి ఎమ్మెల్య కాటపల్లి వెంకట రమణారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీకి మధ్య కొన్ని రోజులుగా అరోరా భూముల వివాదంపై సాగుతున్న సవాళ్ల పర్వం ఘర్షణలకు దారితీసింది.
విధాత : కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య పరస్పర దాడులతో కామారెడ్డి పట్టణం అట్టుడికిపోతుంది. కామారెడ్డి ఎమ్మెల్య కాటపల్లి వెంకట రమణారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీకి మధ్య కొన్ని రోజులుగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అరోరా భూముల వివాదంపై సాగుతున్న సవాళ్ల పర్వం ఘర్షణలకు దారితీసింది. అరోరా భూముల వ్యవవహారంలో షబ్బీర్ అలీ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతానని..శి శు మందిర్ వద్ద చర్చకు రావాలని వెంకట రమణారెడ్డి సవాల్ చేశారు.
ఈ సవాల్ కు ప్రతిస్పందిస్తూ కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి తన వర్గీయులతో కలిసి ఏకంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు అఫీస్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నివాసం వద్ద ఉన్న బీజేపీ శ్రేణులకు, మహేందర్ రెడ్డి వర్గీయులకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ శ్రేణులు మహేందర్ రెడ్డిపై దాడికి పాల్పడి ఆయన కారును ధ్వంసం చేసి ఫల్టీ కొట్టించి నిప్పు పెట్టారు.
కాంగ్రెస్ శ్రేణులు తన నివాసంపై దూసుకురావడంతో కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు ఆయనను అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులను అదుపు చేసే క్రమంలో పోలీసులకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వెంటకరమణారెడ్డి మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వస్తానని, షబ్బీర్ అలీ అవినీతిని ఆధారాలతో బయటపెడుతానంటూ భీష్మించుకున్నారు. ఆయనను ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టకుండా పోలీసులు అక్కడే మోహరించారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి ఎమ్మెల్యే ఇంటి వద్ద పరిస్థితి చేయి దాటకుండా బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram