Site icon vidhaatha

Pawan Kalyan: లైన్‌లో.. అర డజన్‌ చిత్రాలు! ఎప్పటికయ్యేనో..?

Pawan Kalyan

విధాత: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న హరిహర వీరమల్లు చిత్రంలో న‌టిస్తున్నారు. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ సమయం సరిపోవడం లేదు.

ఇలాంటి సమయంలో ఆయన వరుస చిత్రాలను లైన్‌లో పెడుతున్నారు. తమిళలో వచ్చిన తేరీకి రీమేక్ గా హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ను అనౌన్స్ చేశారు. తాజాగా డీవీవీ దానయ్య నిర్మాతగా సుజిత్ దర్శకత్వంలో OG అనే చిత్రాన్ని లైన్‌లో పెట్టారు.

మరో వంక తమిళంలో హిట్ అయిన వినోదాయ సిత్తం రీమేక్‌కు సైతం ఓకే చెప్పారు. వినోదయ సిత్తంలో ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా కొబ్బరికాయ కొట్టారు. అప్డేట్స్ అయితే ఏమీ లేవు. క‌థ‌లో మార్పులు చేర్పులు ఉంటాయట. ఒరిజినల్ స్క్రిప్ట్ దెబ్బతినకుండా మెయిన్ థీమ్ ను అలానే ఉంచి కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి తమిళంలో దర్శకత్వం వహించిన సముద్ర ఖ‌నినే తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక తమిళంలో స‌ముద్ర‌ఖ‌ని పోషించిన పాత్రను తెలుగులో పవన్ చేయనున్నారు. అయితే తెలుగులో ప‌వ‌న్‌ ఇమేజ్ దృష్ట్యా ఈ పాత్ర నిడివిని పెంచ‌నున్నార‌ని స‌మాచారం. ఇందులో పవన్ మనిషిలా కనిపించే దేవుడిలా నటించనున్నాడు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో పవన్ వెంకీతో కలిసి గోపాల గోపాల చిత్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచన చేస్తున్నారు.

మొత్తానికి పవన్‌ వరుస చిత్రాలనైతే లైన్‌లో పెట్టి కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు కానీ వీటన్నింటినీ ఆయన ఏ విధంగా పూర్తి చేస్తారనేది అంతుపట్టకుండా ఉంది. ఒకవైపు రాజకీయాలు ఒక వైపు సినిమాలతో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అందులోనూ త్వరలోనే ఎన్నికల వేడి కూడా మొదలుకానుంది.

ఇప్ప‌టికే ఏపీలో వాడివేడిగా పాద‌యాత్ర‌లు, ఇత‌ర హంగామాల‌తో రాజ‌కీయాలు వేడెక్కి ఉన్నాయి. లోకేష్ పాద‌యాత్ర మొద‌లైంది. త్వ‌ర‌లో ప‌వ‌న్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఆయనకు సినిమాల్లో నటించేంత సమయం ఉంటుందా? మ‌రి ఈయ‌న వ‌రుస‌గా చిత్రాల‌ను ఎందుకు లైన్‌లో పెడుతున్నారు? ఆయ‌న ఉద్దేశ్యం ఏమిటి? రాజ‌కీయాల‌లో బిజీగా ఉంటూనే ఈ చిత్రాల‌న్నింటిని ఆయ‌న పూర్తి చేయ‌గ‌ల‌రా? అనేవన్నీ సగటు మనిషిని వేధించే ప్రశ్నలుగా చెప్పుకోవాలి.

Exit mobile version