ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బీఫారమ్లు అందజేశారు
రామరాజ్యం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తామని ధీమా
విధాత : ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బీఫారమ్లు అందజేశారు. తొలుత నాదెండ్ల మనోహర్కు బీఫారమ్ అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 21 అసెంబ్లీ, ఇద్దరు లోక్సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించి వారికి బీఫారమ్లు పంపిణీ చేశారు. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ శ్రీ రామనవమి రోజున పార్టీ అభ్యర్థులకు బీ ఫారమ్లు అందజేయడం సంతోషకరంగా ఉందన్నారు. రావణుడిని సంహరించి, రామరాజ్యం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానానికి కృషి చేస్తామని, విద్య, ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి కంకణబద్ధులై పనిచేస్తామని, వలసలు లేని, పస్తులు లేని వికసిత ఏపీ ఏర్పాటు మనందరి బాధ్యత అన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా కూటమి అభ్యర్థుల గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పనిచేస్తామన్నారు.