PM Modi Failure in Karnataka 19 భారీ బహిరంగసభలు.. 3 భారీ రోడ్షోలు ఉచితాలపై హామీలు కుమ్మరించిన ప్రధాని కర్ణాటక ప్రజల చైతన్యం ముందు హుష్కాకి విధాత : ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలంటే అధికార పార్టీ తరఫున ప్రధాన మంత్రి ఒకటి లేదా రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. కానీ.. నరేంద్రమోదీ మాత్రం దాదాపు గల్లీ ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలుకు ముందే అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరిట కర్ణాటకలో తిరిగిన […]
PM Modi Failure in Karnataka
విధాత : ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలంటే అధికార పార్టీ తరఫున ప్రధాన మంత్రి ఒకటి లేదా రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. కానీ.. నరేంద్రమోదీ మాత్రం దాదాపు గల్లీ ప్రచారం నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలుకు ముందే అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరిట కర్ణాటకలో తిరిగిన మోదీ.. ఇక ప్రచారం మొదలైన తర్వాత దాదాపు అక్కడే ఉన్నారా? అనిపించేంత స్థాయిలో ప్రచారం చేశారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 19 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆరు భారీ రోడ్ షోలు నిర్వహించారు.
ఆఖరుకు ప్రచారం నిర్వహించకూడని రోజుల్లో సైతం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ బీజేపీని గెలిపించాలని పరోక్షంగా సందేశం ఇచ్చారు. బీజేపీ ఎన్నికల గుర్తులను ప్రదర్శిస్తూ చేసిన ఆ వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్విట్టర్లో కర్నాటక ప్రజలనుద్దేశించి బహిరంగ లేఖ కూడా రాశారు.
విచిత్రం ఏమిటంటే.. ఇవేవీ కర్ణాటక ప్రజలు పట్టించుకోలేదు. కన్నడిగుల ముందు ప్రధాని పప్పులు ఉడకలేదు. తాను ఒకప్పడు రేవడీలంటూ విమర్శించిన ఉచిత పథకాలను కుమ్మరించినా, ఊరూరూ తిరిగి ప్రచారం చేసినా.. రోడ్డెక్కి రోడ్షోలు నిర్వహించినా.. ప్రజలు బీజేపీని తిరస్కరించారు.
బీజేపీ అవినీతి పాలనను గమనించిన కన్నడ ఓటర్ల ముందు మోదీ దింపుడు కల్లం ఆశలు ఫలించలేదు. గూబ గుయ్మనిపించేలా ఓటర్లు సంచలనాత్మక, చైతన్యపూరిత తీర్పును ప్రకటించారు. నిజానికి కర్ణాటకలో ఓడిపోయింది బీజేపీ మాత్రమే కాదు.. ప్రధాని నరేంద్రమోదీ కూడా! ప్రధాని హోదాను సైతం మరిచిపోయి.. ఒక రాష్ట్ర నాయకుడి స్థాయిలో ఆయన చేసిన ప్రచారానికి నిజానికి ఓట్లు కుప్పలు కుప్పలుగా రాలి ఉండాల్సింది. కానీ.. మోదీ చరిష్మా అనేది కర్ణాటకలో పనిచేయలేదు.
అంతేకాదు.. ఇది రానున్న ఎన్నికల్లో కూడా మోదీ గల్లీ ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్న చర్చను రేకెత్తించింది. అయితే.. ఇదే ఫలితం తారుమారై ఉంటే.. కచ్చితంగా అది మోదీ ఖాతాలోనే పడేసుకునేవారనడంలో సందేహం లేదు. కానీ.. ఇప్పుడు మాత్రం స్థానిక అంశాల కారణంగానే బీజేపీ ఓడిపోయిందని ఆ పార్టీ నాయకులు చెప్పుకొన్నా ఆశ్చర్యం లేదు.