కోర్ కమిటీ సభ్యులకు, సీనియర్ నేతలకు తెలియకుండా అధ్యక్షుడిని ఎలా నియమిస్తారు పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా, వ్యక్తులతో సంబంధం ఉన్న వారికే పదవులు పార్టీలోనే ఉంటూ.. పోటీ కార్యక్రమాలు చేపడతాం పెద్దపల్లిలో ముగిసిన అసమ్మతి బిజెపి నేతల భేటీ విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ బిజెపిలో పోటీ కార్యక్రమాలు నడిపిన విషయం ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కు గుర్తుండే ఉంటుంది.. మేము కూడా ఆయన బాటలోనే నడవాలని నిర్ణయించాం.. అంటున్నారు పెద్దపల్లి బిజెపి అసమ్మతి […]
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ బిజెపిలో పోటీ కార్యక్రమాలు నడిపిన విషయం ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కు గుర్తుండే ఉంటుంది.. మేము కూడా ఆయన బాటలోనే నడవాలని నిర్ణయించాం.. అంటున్నారు పెద్దపల్లి బిజెపి అసమ్మతి నేతలు. పార్టీ ప్రయోజనాల కన్నా, వ్యక్తుల ప్రయోజనాలకే రాష్ట్ర బిజెపిలో అధిక ప్రాధాన్యత లభిస్తున్నదని తమ నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలు పక్కనపెట్టి… వ్యక్తులతో సంబంధాలు ఉన్నవారికే పదవులు దక్కుతున్నాయని వారు మండిపడ్డారు.
బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా రావుల రాజేందర్ నియామకం అనంతరం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేతలు ఆదివారం పెద్దపల్లిలో సమావేశమయ్యారు. “వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నది పార్టీ ఆలోచన” ఈ జిల్లాలో మాత్రం పార్టీ కార్యక్రమాల ఊసే లేదు… పార్టీ నిర్మాణం దిశగా దృష్టి పెట్టింది లేదు… పరిస్థితి ఇలాగే కొనసాగితే కార్యకర్తలను ఎన్నికల వైపు కార్యోన్ముఖులను చేయడం ఎలా అని అసమ్మతి నేతలు ప్రశ్నించారు.
జిల్లాలో ఇప్పటివరకు నూటికి నూరు శాతం బూత్ కమిటీల నిర్మాణం పూర్తి కాలేదన్నారు. ఇకపై తామే పూనుకొని మిగిలిన 20 శాతం బూత్ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడితో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. పార్టీలోనే ఉంటూ పోటీ కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఓ నిర్ణయానికి వచ్చారు.
జిల్లాలోని పార్టీ కోర్ కమిటీ సభ్యులకు కనీసం తెలపకుండా, మొదటినుండి పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేతలను సంప్రదించకుండా అధ్యక్షుడి ఎంపిక ఎలా చేస్తారని వారు మండిపడ్డారు.
పార్టీలోనే ఉంటూ సహాయ నిరాకరణ పాటించాలని ఈ భేటీలో వారు నిర్ణయానికి వచ్చారు.
సమావేశంలో మాజీ శాసనసభ్యులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, మీస అర్జున్ రావు, బల్మూరి అమరేందర్రావు, చింతల లింగారెడ్డి, కర్రె సంజీవరెడ్డి, పిన్నింటి రాజు, మహేందర్ యాదవ్, కుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతేకాకుండా పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల తో పాటు ధర్మారం, కమాన్ పూర్ మండల శాఖల అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు.