Sheela Bhatt | మాఫియా డాన్ దావుద్తో శీలాభట్ ఇంటర్వ్యూ!
Sheela Bhatt ఒక్కసారి కాదు.. అనేకసార్లు.. దేశ విదేశాల్లోనూ కలిసి మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు శీలాభట్ దావుద్ చిన్న నేరస్థుడు నాటి నుంచి మొదలు అండర్ వరల్డ్ డాన్ అయ్యాక కూడా ఇంటర్వ్యూలు 1988లో దుబాయ్లో దావుద్ ఇంటర్వ్యూ ఫొటోతో గుర్తింపు ఇటీవల పాత జ్ఞాపకాలు గుర్తుచేస్తున్న శీలాభట్ విధాత: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం.. అనేక దేశాలకు మోస్ట్వాంటెడ్ క్రిమినల్. హత్యలు, దోపిడీలు, డ్రగ్స్, స్మగ్లింగ్, ఉగ్రవాదం.. వంటి అభియోగాలు అతడిపై అనేకం. బయటకు […]

Sheela Bhatt
- ఒక్కసారి కాదు.. అనేకసార్లు.. దేశ విదేశాల్లోనూ
- కలిసి మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు శీలాభట్
- దావుద్ చిన్న నేరస్థుడు నాటి నుంచి మొదలు
- అండర్ వరల్డ్ డాన్ అయ్యాక కూడా ఇంటర్వ్యూలు
- 1988లో దుబాయ్లో దావుద్ ఇంటర్వ్యూ ఫొటోతో గుర్తింపు
- ఇటీవల పాత జ్ఞాపకాలు గుర్తుచేస్తున్న శీలాభట్
విధాత: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం.. అనేక దేశాలకు మోస్ట్వాంటెడ్ క్రిమినల్. హత్యలు, దోపిడీలు, డ్రగ్స్, స్మగ్లింగ్, ఉగ్రవాదం.. వంటి అభియోగాలు అతడిపై అనేకం. బయటకు కనిపించకుండా అనేక దేశాలను భయపెడుతున్న అదృశ్యశక్తి. అతడిని ఎవరూ అంత ఈజీగా కలువలేరు. అతడు ఎవరినీ కలువడు. తెరవెనుక నుంచే అన్ని కార్యకలాపాలు నిర్వర్తిస్తాడు. అలాంటి మాఫియా డాన్ను ఒక మహిళా జర్నలిస్టు కలిశారు. ఇంటర్వ్యూ చేశారు. అ
ది కూడా ఎదో ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు. అనేక సార్లు. దేశ విదేశాల్లోనూ దావూద్ను కలిసి ఇంటర్వ్యూలు చేశారు. ఆమె పేరు శీలాభట్. సీనియర్ జర్నలిస్టు.. ఇటీవల ఆమె ఎన్డీటీవీతో మాట్లాడారు. ముంబైలో 1962లో పుట్టిన ఆమె.. తన జర్నలిజం కెరిర్ అనుభవాలను వెల్లడించారు. ముఖ్యంగా మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంతో జరిగిన ఇంటర్వ్యూల విశేషాలను వివరించారు. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
1981లో దావుద్ను తొలిసారి కలిసిన శీలాభట్
1970లో ముంబై డాన్ కరీంలాలాను జర్నలిస్టు శీలాభట్ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబంధించిన వార్త చిత్రలేఖ మ్యాగజైన్లో కరీంలాలా, శీలాభట్ ఫొటోలతోసహా వచ్చింది. ఈ ఇంటర్వ్యూ దావుద్ దృష్టిని ఆకర్షించింది. శీలాభట్కు దావుద్ ఫోన్చేసి సహాయం కోరాడు. కరీంలాలా మనుషులు చేసే అరాచకాల గురించి రాయాలని విజ్ఞప్తి చేశాడు. ముంబైలోని మహ్మద్ అలీ రోడ్లోని ప్రభుత్వ రిమాండ్హోమ్లో కరీం లాలాకు చెందిన వ్యక్తులు వేధింపులకు పాల్పడుతున్నారని, వారికి వ్యతిరేకంగా రాయాలని దావూద్ విజ్ఞప్తిచేశాడు.
‘కరీంలాలాను మీరు కలిశారుగా.. అతడి మనుషులు మహిళలను ఎలా వేధిస్తున్నారో రాయండి’ అని కోరాడు. ‘1981-82 ప్రాంతంలో దావుద్ కేవలం నేరస్థుడు. అప్పడప్పుడే నేరసామ్రాజ్యంలో ఎదుగుతున్న వ్యక్తి. మార్వాడీ, సింధీ, పంజాబీలు అతడికి అనుచరులుగా ఉండేవారు’ అని ఆమె పేర్కొన్నారు. ఆ ఫోన్ కాల్ తర్వాత కొన్ని రోజులకే దావుద్తో తొలి ఇంటర్వ్యూ అవకాశం లభించిందని, తన భర్తతో కలిసి డాన్ను కలవడానికి వెళ్లాలని శీలాభట్ తెలిపారు.
జైలులో ఫుట్బాల్ ఆడిన దావుద్
“మొదట, వారు మమ్మల్ని ముంబైలోని జైల్ రోడ్ సమీపంలోని ట్యాంకర్ స్ట్రీట్కి పిలిచారు. తర్వాత మమ్మల్ని కారులో ఎక్కించి, నాకు తెలిసిన పక్మోడియా స్ట్రీట్కి తీసుకెళ్లారు. అక్కడ మేము దావుద్ను కలిశాం. నేను, నా భర్త… దావూద్, చోటా షకీల్ (దావుద్ అనుచరుడు)ను కలిశాం. కరీం లాలా దుర్మార్గుడు.. మంచివాడు కాదు.. అని అతను చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు గుజరాత్లోని బరోడా జైలులో మళ్లీ దావుద్ను కలిశాను. ముంబైలో నివాసం ఉంటున్న నేను కేవలం డాన్ దావుద్ను కలిసేందుకు కోసమే గుజరాత్ వెళ్లాను.
అధికారుల అనుమతితో బరోడా జైలుకు వెళ్లినప్పుడు దావూద్ అక్కడ ఫుట్ బాల్ ఆడుతూ కనిపించాడు. నేను ఆశ్చర్యపోయాను. ముంబైలో కరీం లాలా వ్యాపారాలు నిర్వహించే అలంజేబ్ను విడిచిపెట్టనని చంపేస్తానని దావూద్ చెప్పాడు. నేను దాని గురించి రాశాను. కొన్ని రోజులు అతడు మరణించడంతో నేను రాసిన కథనం నిజమైంది. ఆ తర్వాత 2-3 ఏండ్ల వరకు దావుద్ను కలువలేదు” అని ఆమె చెప్పింది.
దుబాయ్లో దావుద్ మోడలింగ్.
“1987లో దుబాయ్ నుంచి దావూద్ మళ్లీ ఫోన్ చేశాడు. అనేక ఫోన్కాల్స్ చేసిన తర్వాత అతడి అపాయింట్మెంట్ దొరికింది. డ్రగ్స్ వ్యాపారం గురించి అతడిని ఇంటర్వ్యూ చేయడానికి 1988లో దుబాయ్కి వెళ్లాను. నేను దావూద్ను కలవడం కంటే టిక్కెట్కు రూ.3,500 ఖర్చు చేసిన మొత్తమే నన్ను ఆందోళనకు గురిచేసింది. దావుద్ను దుబాయ్లో కలువడానికి ఎలాంటి భయం కలుగలేదు.
ఎందుకంటే అప్పటికే నేను అండర్ వరల్డ్ మాఫియా నేరగాళ్లు అయిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలే, ఛోటా రాజన్, వరదరాజన్ ముదలియార్, యూసుఫ్ పటేల్, హాజీ, మస్తాన్, అరుణ్ గావ్లీని ఇంటర్వ్యూ చేశాను. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఎవరైనా పంపారా? అని దావుద్ ప్రశ్నించాడు. నేనే నంబర్ వన్ రిపోర్టర్ను అని చెప్పాను. దుబాయ్లో మొదటి రోజు దావూద్ ఇంటర్వ్యూకు నో చెప్పి తిందాం అన్నాడు. మరుసటి రోజు కూడా ఇంటర్వ్యూను తిరస్కరించాడు. కానీ చాలాసేపు ఇతర విషయాలు మాట్లాడాడు. అతడు మోడలింగ్ చేసేవాడు. ఇటాలియన్ సూట్లపై కూడా మాట్లాడాడు ” అని శీలాభట్ వివరించారు.
ఇంటర్వ్యూకు టేప్ను అనుమతించ లేదు.
దుబాయ్లో మూడో రోజు దావుద్ ఇంటర్వ్యూకు అనుమతించాడు. కానీ, దానిని టేప్ చేయడానికి అతడు అనుమతించలేదు. దావుద్ నా చేతిలోని నా డైరీని తీసుకొని చూశాడు. డైరీలో గ్యాంగ్స్టర్లకు సంబంధించిన అందరి ఫోన్ నంబర్లు ఉన్నాయి. తర్వాత అలామ్జేబ్తో సహా అతడి ప్రమేయంతో జరిగిన మూడు హత్యల గురించి మాట్లాడాడు. నేను అతన్ని చంపకపోతే.. అతడు నన్ను చంపేవాడు. మీరు చెప్పండి శీలాజీ.. నేను అతన్ని చంపకుండా ఉండాలా? అని నన్ను ప్రశ్నించాడు.
కానీ, నేను ఏమీ అనలేదు. నేను రాసుకుంటూ ఉన్నాను. నేను అతడు చెప్పిన విషయాలను, మాటలను చెప్పినట్టే రాశాను. అతడి మాటలను, వ్యాఖ్యలను ఎక్కడా వక్రీకరించను అనే నమ్మకం నాపై అతడికి ఉన్నట్టు ఉన్నది. అందుకే నాకు మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. చివరిసారిగా దావుద్తో 2002లో మాట్లాడాను. అప్పుడు పాక్ ప్రధాని ఫర్వేజ్ ముషారప్ భారత పర్యటనలో ఉన్నారు* అని శీలాభట్ వివరించారు.