శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం గురువారం భద్రాచల దివ్యక్షేత్రంలో భక్తజన జయజయద్వానాల మధ్య వైభవంగా సాగింది
హారజైన గవర్నర్ రాధాకృష్ణన్
విధాత : శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం గురువారం భద్రాచల దివ్యక్షేత్రంలో భక్తజన జయజయద్వానాల మధ్య వైభవంగా సాగింది. కల్యాణమూర్తులు సీతరాములు శోభాయాత్రంగా మిధిలా ప్రాంగణం చేరుకోగా, భక్తజనం శ్రీరామనామస్మరణతో భద్రగిరి పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. వైదిక పండిత బృందం శ్రీరామరాజ్యంలో ప్రజాశ్రేయస్సు ఎలా వర్ధిల్లిందో వివరించగా, గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాధిరాజుగా దర్శనమిచ్చారు. ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించిన రాములవారిని చూసి భక్తజనం తరించింది.
రాములోరి సేవలో తరలించడం నా అదృష్టం: గవర్నర్
సీతారామచంద్రస్వామి వారి మహా పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో రమాదేవి ఆయనకు స్వాగతం పలికారు అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలిచ్చి తీర్ధప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఆ తర్వాత గవర్నర్ మిథిలా మండపానికి చేరుకుని మహాపట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని సేవించడం సంతోషంగా ఉందని ఇది తన అదృష్టమన్నారు. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించడం, సుఖసంతోషాలతో ఉండేలా చూడటమే రామరాజ్య స్థాపన ఉద్దేశమన్నారు.