Vemulawada | ఒకే సన్నిధిలో రెండు కళ్యాణాలు

"మామూలు వైవాహిక జీవితం గడుపుతూనే, ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున వారు శివున్ని పెళ్ళాడుతారు" అనేక దశాబ్దాలుగా సాగుతున్న ఈ శివపార్వతుల పెళ్లి విశ్వాసంతో మొదలై, ఆచారంగా పరిణమించింది. జీవనశైలిగా ఇక్కడ దర్శనమిస్తోంది

  • Publish Date - April 17, 2024 / 02:17 PM IST

ఓవైపు రాముని కళ్యాణం
మరోవైపు శివునితో జోగినీల కళ్యాణం
వారు దేవుని పెళ్లి చేసుకోవడానికి కారణాలేమిటి?
దేశంలో ఎక్కడా లేని ఆచారం ఇక్కడే ఎందుకు?
విశ్వాసంగా మొదలై, ఆచారంగా మారిన దేవుడితో పెళ్లి

(తాడూరు కరుణాకర్, కరీంనగర్)

“మామూలు వైవాహిక జీవితం గడుపుతూనే, ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున వారు శివున్ని పెళ్ళాడుతారు” అనేక దశాబ్దాలుగా సాగుతున్న ఈ శివపార్వతుల పెళ్లి విశ్వాసంతో మొదలై, ఆచారంగా పరిణమించింది. జీవనశైలిగా ఇక్కడ దర్శనమిస్తోంది. అలవికాని పేదరికం, తీవ్రమైన అనారోగ్యం, ఎదుగు బొదుగులేని జీవితం, నిరాశావహమైన భవిష్యత్తు “వారిని దేవుణ్ణి పెళ్లి చేసుకునేలా చేస్తున్నాయి”…

దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి తరువాత అంతే వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. అయితే దేశంలో మరెక్కడ లేని విధంగా, ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణంలో జోగినీలు శివుడిని తమ భర్తగా భావించి వివాహాలు చేసుకుంటారు. శివుడిని పరిణయం ఆడడం అనే సాంప్రదాయం నాలుగు దశాబ్దాల క్రితం నుండే ఇక్కడ కొనసాగుతోందని ఆలయ అర్చకులు ఒకరు తెలిపారు.

“వేదికపై ఓవైపు దేవతామూర్తులకు కళ్యాణ్ ఉత్సవం వైభవంగా సాగుతుంటే, ఆ సన్నిధిలోనే జోగినీలు శివుడిని తమ నాధునిగా భావించి ధారణ చేస్తారు” కేవలం ఈ వివాహం కోసమే తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, మహారాష్ట్రల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు.

ఈ రెండు ఘట్టాలు చూడాల్సిందే!

శ్రీ సీతారామ చంద్రులకు తలంబ్రాలు సమర్పించే వేళ వేములవాడ రాజన్న సన్నిధిలో శివసత్తుల వివాహ ఘట్టం తలంబ్రాల వర్షం కురుస్తున్నట్టు మారిపోతుంది. శివపార్వతులు నవమి రోజున శివుడిని తమ భర్తగా భావించి వివాహాన్ని పునరుద్ధరించుకునేందు కోసమే ఇక్కడికి వేల సంఖ్యలో తరలివస్తారు. శివసత్తుల వివాహ సమయంలో వారి చేతుల్లోని త్రిశూలం గంటలమోతలు, కళ్యాణ వేదిక ప్రాంగణమంతా వర్షపు జల్లుగా కురిసే తలంబ్రాలు, శివసత్తుల పూనకాలు అద్భుత దృశ్యాలు. రుద్రాక్షలు మంగళసూత్రాలుగా, కాళ్లకు రాగిమట్టెలు, చేతికి త్రిశూలం ఇచ్చి వీరశైవులు వీరి పెళ్లి తంతును పూర్తి చేస్తారు.

ఆచారాన్ని రూపుమాపేందుకు..

మహిళలు, పురుషులే కాదు.. లోకజ్ఞానం తెలియని ఆడపిల్లను శివపార్వతులుగా మార్చే శివుడితో పెళ్లి తంతు ప్రక్రియ ధారణ పేరుతో వేములవాడ రాజన్న సన్నిధిలో ఏళ్ల తరబడి సాగిపోతూనే ఉంది. అటు ప్రభుత్వం, ఇటు పోలీసు యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు చిన్నారుల పెళ్ళికి అభ్యంతరాలు చెబుతున్నా, పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందే తప్ప.. ఆచారం మాత్రం యధావిధిగా కొనసాగుతూనే ఉంది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ ,జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, కొమరం భీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జనగామ, వరంగల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుండి ఎక్కువగా, ఇతర జిల్లాల నుండి సంఖ్య కాస్త తక్కువగా శివపార్వతులుగా మారిన స్రీలు,పురుషులు, పిల్లలు వేములవాడలో జరిగే శ్రీరామ నవమికి తప్పక హాజరవుతారు.

రామయ్య కళ్యాణం రోజునే తమ పెళ్లిళ్ల పునరుద్ధరణ

రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే.. నవమి నాటికి శివపార్వతులు వేములవాడ చేరుకుంటారు. శివుడితో ధారణ పేరుతో తమ పెళ్లిళ్లు పునరుద్ధరించుకుంటారు. ఈ సంఖ్య 50 వేల నుండి లక్ష వరకు ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. సీతారామ కళ్యాణానికి ముందే శివపార్వతులు కొత్త దుస్తులు ధరించి, నుదుట పెద్ద బొట్టుతో, తలపై జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, భుజానికి జోలె, అక్షింతలు పట్టుకొని శివుడితో వివాహానికి సిద్ధమవుతారు. ఇందులో వైవాహిక జీవితం గడుపుతున్న వారు కూడా ఉన్నారు.

అనారోగ్య కారణాలు, జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలు తెలంగాణలో అనేక మందిని శివపార్వతులుగా మార్చడంలో దోహదపడుతున్నాయి. వేములవాడ దేవస్థానంలో శివపార్వతుల పెళ్లి తంతు వీరశైవులు నిర్వహిస్తారు. శివపార్వతులుగా మారేవారికి వీరశైవులు మెడలో రుద్రాక్షను మంగళసూత్రంగా వేస్తారు. కాళ్లకు రాగి మట్టెలు తొడిగి స్త్రీ, పురుష భేదం లేకుండా వారికి చీర కట్టిస్తారు. అనంతరం చేతికి త్రిశూలం ఇచ్చి శివుడితో పెళ్లి జరిపిస్తారు.

దీంతో ఆయా స్త్రీ, పురుషులు శివపార్వతులుగా మారినట్టు భావిస్తారు. శివపార్వతులు కనీసం ఐదు ఇళ్లలో, శ్రావణమాసంలో కొన్ని వారాలపాటు భిక్షాటన చేస్తారు.శివుడిని పెళ్లి చేసుకున్న తరువాత శివుడి భార్యగానే కొనసాగుతున్న వారు ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన జీవనం గడుపుతున్న వారు, కుటుంబ జీవన వ్యవస్థలో కొనసాగుతున్న వారిలో కొందరు నవమి రోజు వేములవాడ వచ్చి ఈ ధారణ కార్యక్రమంలో పాల్గొంటారు.

Latest News