బీహార్లోని బేగుసరాయిలో మద్యం స్మగ్లర్లు రెచ్చిపోయారు. బుధవారం తెల్లవారుజామున మద్యం స్మగ్లర్లు పోలీసులపైనే దాడి చేశారు.
పాట్నా: బీహార్లోని బేగుసరాయిలో మద్యం స్మగ్లర్లు రెచ్చిపోయారు. బుధవారం తెల్లవారుజామున మద్యం స్మగ్లర్లు పోలీసులపైనే దాడి చేశారు. ఈ దాడిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చనిపోగా.. హోంగార్డు సహా ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని బేగుసరాయిలోని సదర్ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్మగ్లర్లను పట్టుకునేందుకు కూంబింగ్ ప్రారంభించారు.
ఘటన జరిగిన సమయంలో బేగుసరాయి పోలీసుల బృందం అక్రమ మద్యాన్ని పట్టుకునేందుకు అక్కడికి చేరుకున్నది. ఈ ఘటన బేగుసరాయిలోని నవకోటి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌతాన వంతెన సమీపంలో జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున అక్రమ మద్యం వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ సరుకును ఆల్టో కారులో దాచి తీసుకువస్తున్నారు.
దీంతో నవకోటి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కమాస్ చౌదరి తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మద్యం కూడా జప్తు చేశారు. అయితే.. ఈ సమయంలో కూడబలుకున్న స్మగ్లర్లు.. సబ్ ఇన్స్పెక్టర్పైకి వాహనం నడిపించి, ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో సబ్ ఇన్స్పెక్టర్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ దాడిలో హోంగార్డు బాలేశ్వర్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఈ స్మగ్లర్ల దాడి వార్త అందిన వెంటనే జిల్లా పోలీసులు సరిహద్దులను సీల్ చేసి పెద్ద ఎత్తున కూంబింగ్ ప్రారంభించారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు ఎలక్ట్రానిక్, మాన్యువల్ నిఘా పెట్టారు. అయితే ఇప్పటివరకు స్మగ్లర్ల గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే బాలేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం స్మగ్లర్ల వాహనం కనిపించగానే ఒక్కసారిగా ఎవరో పోలీస్ బృందంపై దాడి చేశారు.
ఇంతలో స్మగ్లర్ల కారు మరొకటి వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ను ఢీకొని వెళ్లింది. సంఘటన స్థలంలో జరిగిన ఈ తొక్కిసలాటలో అక్కడ మొహరించిన పోలీసులు అటు -ఇటు పరిగెత్తడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మరోవైపు కూంబింగులో కారు యజమాని పట్టుబడ్డాడని బేగుసరాయి పోలీసులు బుధవారం తెల్లవారు జామున సమాచారం అందించారు. అయితే కారు ఇంకా రికవరీ కాలేదు. నిందితుల ఆచూకీ కొరకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.