ప్రజా ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేర్చేదిశగా టి-సాట్ విస్తరణ
ప్రజా ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేసేదిశగా టి-సాట్ ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు

- సీఈవో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
- హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్, సీనియర్ జర్నలిస్టులు
విధాత: ప్రజా ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేసేదిశగా టి-సాట్ ను విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం టీ-సాట్ కార్యాలయంలో సీఈవోగా వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ ఐటీ శాఖ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్ తో పాటు ఇతర సీనియర్ జర్నలిస్ట్లు కార్యక్రమంలో పాల్గొని వేణుగోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ చానళ్లలో టి-సాట్ ను నెంబర్ వన్ స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తనపై గురుతర బాధ్యత ఉంచిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, తన నియామకానికి సహకరించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ణతలు తెలియజేసారు. అలాగే మొన్నటివరకూ టి-సాట్ సీఈవోగా పనిచేసిన శైలేష్ రెడ్డిని అభినందించారు.
ఇప్పటికే అకడమిక్, కాంపిటీటీవ్ రంగాల్లో అందిస్తున్న సేవల్ని మరింత విస్తృతపర్చడంతో పాటు, విద్య, వైద్యం, వ్యవసాయం, శాస్త్ర, సాంకేతికత తదితర రంగాల్లోకి టి-సాట్ నెట్వర్క్ ను తీసుకెళ్తామన్నారు. ప్రస్థుతం నడుస్తున్న నిపుణ, విద్య చానళ్లకు అదనంగా మరిన్ని చానళ్లను సైతం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. చానళ్లను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ సంస్థల్లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసి, ఇండిపెండెంట్ జర్నలిస్టుగా ప్రజా సమస్యలను నిరంతరం ప్రశ్న రూపంలో వెలికితెచ్చిన బోదనాపల్లి వేణుగోపాల్ రెడ్డి టి-సాట్ సీఈవోగా నియామకం కావడం గర్వకారణమన్నారు. ఉద్యమకారుడిగా ప్రసిధ్దులైన వేణుగోపాల్ రెడ్డి మంచి ఆలోచనాపరుడని, తన సామర్థ్యంతో టి-సాట్ నిర్వహణ, విస్తరణ దిశగా నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని అకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూనివర్శిటి రిజిస్ట్రార్ ఎవిఆర్ఎన్ రెడ్డి, తెలంగాణ మాస పత్రిక ఎడిటర్ కోడూరు శ్రీనివాసరావ్, టీయూడబ్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహాత్ అలీ, మైక్ టీవీ ఛైర్మన్ అప్పిరెడ్డి, సీఈవో సతీష్, జనంసాక్షి ఎడిటర్ రహమాన్, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, బిగ్ టీవీ చీఫ్ ఎడిటర్ పీవీ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు సారథి, సూరజ్, బుచ్చన్న, సాధిక్, పరిపూర్ణా చారి తదితరులు పాల్గొన్నారు.