మేడిగడ్డపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది

మేడిగడ్డపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
  • కార­ణా­లే­మిటి? కార­కు­లె­వరు?
  • నిగ్గు తేల్చా­లన్న మంత్రి ఉత్తమ్‌
  • ప్రభుత్వ ఆదే­శా­లతో కది­లిన బృందాలు
  • ఈఎన్సీ ఆఫీస్ సహా 12 చోట్ల సోదాలు
  • పలు కీలక రికా­ర్డుల స్వాధీనం
  • ప్రాజెక్టు నిర్మా­ణంలో కీలక వ్యక్తి ఎవరు?
  • ఏం చేశారు? కాంట్రాక్టు ఎలా ఫైనల్ చేశారు?
  • విచా­రణ జరిపే అంశాల్లో ఇవి కూడా!
  • జ్యూడి­షి­యల్ విచా­రణ జరి­పిం­చండి
  • హైకోర్టు సీజేకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

విధాత : కాళ్వేరం అవి­నీతి, మేడి­గడ్డ బరాజ్‌ కుంగు­బా­టుకు కార­ణాలు తేల్చా­లని రాష్ట్ర ప్రభుత్వం విజి­లెన్స్ ఎన్‌­ఫో­ర్స్‌­మెంట్‌ విచా­ర­ణకు ఆదే­శిం­చింది. ఈ మేరకు ఇరి­గే­షన్ శాఖ మంత్రి ఎన్‌ ఉత్త­మ్‌­కు­మా­ర్‌­రెడ్డి అధి­కా­రిక ప్రక­టన చేశారు. మేడి­గడ్డ బరాజ్‌ పిల్లర్లు కుంగి­పో­వ­డా­నికి కార­ణా­లను, బాధ్యు­లైన అధి­కా­రు­లను గుర్తిం­చేం­దుకు ప్రభుత్వం విజి­లెన్స్ ఎన్‌­ఫో­ర్స్‌­మెంట్ విచా­ర­ణకు ఆదే­శాలు ఇచ్చిం­దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రక­టిం­చారు.


హైకోర్టు సీజేకు లేఖ

మేడి­గ­డ్డలో పిల్లర్ల కుంగు­బా­టుపై సిటింగ్‌ న్యాయ­మూర్తి చేత జ్యూడి­షి­యల్ విచా­రణ జరు­పు­తా­మని ప్రక­టిం­చిన ప్రభుత్వం అందుకు క్యాబి­నెట్‌ సమా­వే­శంలో తీర్మానం చేసిం­దని, సిట్టింగ్ జడ్జి విచా­రణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయ­మూ­ర్తికి లేఖ రాసిం­దని ఉత్త­మ్‌­కు­మా­ర్‌­రెడ్డి తెలి­పారు. ముందుగా విజి­లెన్స్ విచా­ర­ణకు ఆదే­శిం­చా­మ­న్నారు. కాళే­శ్వరం అవి­నీ­తి­పైన, మేడి­గడ్డ కుంగు­బా­టు­పైన జ్యూడి­షి­యల్‌, విజి­లెన్స్ విచా­ర­ణలో ప్రాజెక్టు నిర్మా­ణంలో కీలక వ్యక్తి ఎవరు? ఏం చేశారు? కాంట్రాక్టు ఎలా ఫైనల్ అయ్యింది? అనే అంశా­లపై విచా­రణ చేయా­లన్న ఆదే­శిం­చి­నట్టు ఉత్తమ్ వెల్ల­డిం­చారు. విజి­లెన్స్ ఎంక్వై­రీలో రిటైర్డ్ చీఫ్ ఇంజ­నీర్, సీఏ ఉంటా­రని తెలి­పారు.


రంగం­లోకి విజి­లెన్స్ బృందాలు

మేడి­గడ్డ కుంగు­బా­టుపై విచా­రణ చేయా­లన్న ప్రభుత్వ ఆదే­శా­లతో విజి­లెన్స్ శాఖకు చెందిన 12 బృందాలు వెంటనే రంగం­లోకి దిగాయి. ఈఎన్సీ ముర­ళీ­ధ­ర్‌­రావు కార్యా­ల­యంతో పాటు కాళే­శ్వరం ప్రాజె­క్టుకు సంబం­ధిం­చిన 12 చోట్లలో ఉన్న కార్యా­ల­యాల్లో తని­ఖీలు చేప­ట్టారు. జల­సౌ­ధ­లోని ఈఎన్సీ కార్యా­ల­యం­లోని రెండో అంతస్తు, నాల్గవ అంత­స్తులో సోదాలు నిర్వ­హించి, రికా­ర్డు­లను సీజ్ చేశారు. జయ­శం­కర్ భూపా­ల­పల్లి జిల్లా కాళే­శ్వరం ప్రాజెక్టు కార్యా­ల­యంలో, మహ­దే­వ­పూర్ ఇరి­గే­షన్ డివి­జన్ కార్యా­ల­యంలో, రామ­గుండం కార్యా­ల­యంలో విజి­లెన్స్ బృందాలు తని­ఖీలు నిర్వ­హించి రికా­ర్డు­లను స్వాధీనం చేసు­కుం­టు­న్నాయి.


ఎన్ని­క­లకు ముందు కుంగిన మేడి­గడ్డ బరా­జ్‌ను ఇటీ­వల మంత్రుల బృందం పరి­శీ­లిం­చింది. అక్కడే అధి­కా­రు­లతో పవర్ పాయింట్ ప్రజెం­టే­షన్ ద్వారా కాళే­శ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. మేడి­గడ్డ బరాజ్‌ కుంగు­బాటు పరి­స్థి­తులు, మర­మ్మ­తు­లకు చేప­ట్టా­ల్సిన చర్య­లపై ప్రజ­లకు వివ­రాలు వెల్ల­డిం­చారు. ప్రభుత్వం కాళే­శ్వరం అవి­నీ­తిపై జ్యూడి­షి­యల్ విచా­ర­ణకు ఆదే­శి­స్తా­మని ఇప్ప­టికే అసెం­బ్లీలో ప్రక­టన చేసింది. సిటింగ్ జడ్జి కేటా­యిం­పులో ఆల­స్య­మైతే జ్యూడి­షి­యల్ విచా­రణ జాప్య­మ­వు­తుం­దన్న ఆలో­చ­నతో ప్రభుత్వం ఉన్నట్టు తెలి­సింది. అందుకే ముందుగా విజి­లెన్స్ విచా­ర­ణకు మొగ్గు చూపి అందుకు ఆదే­శా­లి­చ్చిం­దని చెబు­తు­న్నారు.


సోమ­వారం కరీం­న­గర్ ఇరి­గే­షన్ శాఖలో కాళే­శ్వరం విభా­గంలో చోరీ జరు­గడం, విలు­వైన రికా­ర్డులు, హార్డ్ డిస్క్‌లు చోరీకి గురి­కా­వ­డంతో పలు అను­మా­నాలు తలె­త్తు­తు­న్నాయి. దీంతో ఇక ఆలస్యం చేయడం మంచి­ది­కా­దన్న భావిం­చిన ప్రభుత్వం జ్యూడి­షి­యల్ విచా­ర­ణకు ముందు విజి­లెన్స్ విచా­ర­ణకు ఆదే­శిం­చింది. కాళే­శ్వరం ప్రాజె­క్టులో చోటు­చే­సు­కున్న అవి­నీ­తిపై విజి­లెన్స్ విచా­రణ ప్రారంభం కావ­డంతో ఇరి­గే­షన్ శాఖ అధి­కా­రుల్లో, కాంట్రాక్టు సంస్థల గుండెల్లో గుబులు మొద­లైంది. లక్ష కోట్ల వరకు ఖర్చు జరి­గిన కాళే­శ్వరం ప్రాజె­క్టులో భాగంగా రూ.4600 కోట్లతో నిర్మిం­చిన మేడి­గడ్డ బరాజ్‌.. కట్టిన రెండే­ళ్లకే కుంగి­పో­వడం, అన్నారం, సుందిళ్ల బరా­జ్‌­లలో లీకే­జీలు వెలుగు చూడ­టంతో ప్రాజెక్టు మను­గ­డను ప్రశ్నా­ర్థకం చేసింది. అంతకు ముందే వర­దల్లో పంప్‌­హౌ­జ్‌లు ముంపుకు గురైన సమ­యం­లోనే ప్రాజెక్టు నిర్మిం­చిన తీరుపై అను­మా­నాలు వ్యక్త­మ­య్యాయి. ఇలా మొదటి నుంచీ వివా­దా­ల­మ­య­మైన కాళే­శ్వరం ప్రాజె­క్టుపై విజి­లెన్స్ విచా­ర­ణలో ఎలాంటి నిజాలు వెలు­గు­చూ­డ­బో­తా­య­న్నది ఆస­క్తి­క­రంగా మారింది.