Warangal
- మీరు అనాథలు కాదు… నేనున్నా
- చదివిస్తా, మంచిజీవితాన్ని ఇస్తా
- భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన
ప్రసాద్ వారం రోజుల క్రితం రోడ్డుప్రమాదంలో మరణించాడు. అతని భార్య నాలుగు సంవత్సరాల క్రితమే ప్రమాదంలో మృతి చెందింది. దీంతో వారి ఇద్దరు పిల్లలు దిక్కులేని పక్షులుగా మారారు. కన్నవారులేక, కాపాడే దిక్కులేక కన్నీరు మున్నీరుగా ఆ చిన్నారులు విలపిస్తున్నారు.
విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ శుక్రవారం వారి ఇంటికి వెళ్లారు. పిల్లలిద్దరు ఎమ్మెల్యే మీదపడి ఏడ్వడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సైతం కంటతడిపెట్టుకున్నారు. వారి దయనీయపరిస్థితి చూసి కరిగిపోయారు.
అమ్మా.. నాన్న లేరని అధైర్యపడకండి. మీ..జీవితానికి నాదీ భరోసా అని అక్కున చేర్చుకొని ధైర్యం చెప్పారు. మీరు చదివినంత కాలం చదివిస్తానని.. మీకు మంచి జీవితాన్ని అందిస్తానని మాట ఇచ్చి కన్నీల్లు తూడ్చారు. రూ.10వేలు తక్షణ ఆర్థికసహాయం అందజేశారు.
ఏ.. అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి అని వారికి ధైర్యం చెప్పారు. దశదినకర్మలు అయ్యాక పిల్లలిద్దరిని మంచి హాస్టల్ లో చేరుస్తానని., అంతదాకా వారిని కనిపెట్టుకొని ఉండమని స్థానిక ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించారు.
దేవుడు తమకు అన్యాయం చేసి తల్లిదండ్రులను లేకుండా చేసినా ఎమ్మెల్యే శంకర్ నాయక్ దేవుని రూపంలో వచ్చి మా..కన్నీళ్లు తుడవడంతో ఆ ఇద్దరు చిన్నారులు చేతులెత్తి మొక్కారు. ఎమ్మెల్యే స్పందన పై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను అభినందించారు.