సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎగువ సభలో 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ వివరాలను రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికంగా వెల్లడించింది. 18 లోక్సభకు ఎన్నికైన నేపథ్యంలో జూన్ 4 నుంచి వారి రాజ్యసభ సభ్యత్వం నిలిచిపోయినట్లు తెలిపింది.
విధాత: సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎగువ సభలో 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ వివరాలను రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికంగా వెల్లడించింది. 18 లోక్సభకు ఎన్నికైన నేపథ్యంలో జూన్ 4 నుంచి వారి రాజ్యసభ సభ్యత్వం నిలిచిపోయినట్లు తెలిపింది. అసోం, బీహార్, మహారాష్ట్రల నుంచి ఇద్దరు చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
కామాఖ్య ప్రసాద్ తాసా, సర్బానంద సోనోవాల్ (అసోం), మీసా భారతి, వివేక్ ఠాకూర్ (బీహార్) ఉదయన్రాజే భోంస్లే, పీయూష్ గోయల్ (మహారాష్ట్ర), దీపేందర్ సింగ్ హుడా (హర్యానా), కేసీ వేణుగోపాల్ (రాజస్థాన్), బిప్లవ్ కుమార్ దేవ్ (త్రిపుర), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్) ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా లోక్సభ ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి విజయం సాధించారు. రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈ ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం త్వరలోనే ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనున్నది.
కామాఖ్య ప్రసాద్ తాసా, సర్బానంద సోనోవాల్ అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది. కనుక ఈ రెండు స్థానాలను కాషాయ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నది. ఉదయన్రాజే భోంస్లే, పీయూష్ గోయల్ లు మహారాష్ట్ర నుంచి ఎన్నికయ్యారు. ఈ రెండు స్థానాలూ బీజేపీనే తిరిగి నిలబెట్టుకోవచ్చు. మీసా భారతి, వివేక్ ఠాకూర్ లు బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీసా భారతి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు. అసెంబ్లీ లో వారికి ఉన్న సంఖ్య బలంతో ఆ స్థానం ఆ పార్టీనే చేజిక్కించుకోవచ్చు. అలాగే వివేక్ ఠాకూర్ జేడీయూ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అక్కడ బీజేపీ, జేడీయూల ప్రభుత్వం ఉన్నది కనుక ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునే అవకాశాలే ఉన్నాయి. హర్యానా నుంచి రాజ్యసభకు ఎన్నికైన దీపేందర్ సింగ్ హుడా స్థానాన్ని తిరిగి కాంగ్రెస్ నిలబెట్టుకోగలదు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31 స్థానాలు గెలుచుకోగా, జేజేపీ 10 స్థానాలు, 6 గురు స్వతంత్రులు గెలిచారు. జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకోవడంతో ప్రస్తుతం అక్కడ రాజకీయ సంక్షోభం ఉన్నది. బీజేపీ జేజేపీలో చీలక తెచ్చింది. సంఖ్యాబలం పరంగా ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోగలదు. కానీ బీజేపీ అక్కడ ఏం చేస్తుందో చూడాలి. బిప్లవ్ కుమార్ స్థానాన్ని బీజేపీ తిరిగి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. అది కూడా కాషాయ పార్టీ ఖాతాలోకే వెళుతుంది. కేసీ వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్లో అధికారంలో బీజేపీ ఉన్నది. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకోవడం కష్టమే.