అమరావతి రాజధాని భూమి పూజ నిర్మాణానికి వచ్చిన ప్రధాని మోదీ మట్టి, నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు. దీనిపై అప్పుడు విమర్శలు వచ్చాయి. నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉండే.
పదేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా
విశాఖ ఉక్కుపై వేలాడుతున్న ప్రైవేటు కత్తి
ఇంకా పూర్తికాని పోలవరం ప్రాజెక్టు
అమరావతిని నిర్మించుకోవాల్సిన సమయం
పదేళ్లుగా ఎదురులేని శక్తిగా బీజేపీ
ఇప్పుడు టీడీపీ, జేడీయూపైనే ఆధారం
భాగస్వామ్య పక్షాలకు ఇదే సదవకాశం
(విధాత ప్రత్యేకం)
అమరావతి రాజధాని భూమి పూజ నిర్మాణానికి వచ్చిన ప్రధాని మోదీ మట్టి, నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు. దీనిపై అప్పుడు విమర్శలు వచ్చాయి. నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉండే. కానీ పదేళ్ల కాలంలో పార్లమెంటులో అనేక బిల్లలను పాస్ చేసుకోవడానికి ఏపీలోని అన్ని పార్టీల మద్దతు తీసుకున్నారు. కానీ ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయారు. దీనికి అక్కడ పదేళ్ల పాలించిన రాష్ట్ర ప్రభుత్వాలను తప్పపట్టవచ్చు. కానీ కేంద్రంలో సొంతంగా మెజారిటీ ఉండటంతో వారి వినతులను మోదీ ప్రభుత్వం స్వీకరించలేదు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నింటికీ రాజధాని నగరాలు ఉన్నాయి. కానీ ఏపీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిని అక్కడి ప్రజలు పదేళ్లు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కీలక భూమిక పోషించాయి. ఏపీలో కూటమికి 21, తెలంగాణలో బీజేపీకి 8 స్థానాలను ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కట్టబెట్టారు. ఎన్డీఏ కూటమికి 400 పార్, బీజేపీ సొంతంగా 370 అని నినదించిన బీజేపీకి దేశ ఓటర్లు షాక్ ఇచ్చారు. 240 మార్క్ దగ్గరే ఆపారు. ఏక వ్యక్తి పాలన, ఏకపక్ష నిర్ణయాలు చెల్లవనే విధంగా ప్రజలు తీర్పు చెప్పారు. అందుకే నాటి యూపీఏ ప్రభుత్వం చేసిన విభజనపై నిత్యం అక్కసు వెళ్లగక్కకుండా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇతోధికంగా నిధులు, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను త్వరతగతిన నెరవేర్చాలి.
ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడమే కాదు, కేంద్ర ప్రభుత్వం నిలబడటంలో ఆయనే కీలకంగా మారారు. కనుక ఏపీ రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ఏపీకి ప్రత్యేక హోదా హామీ సాధించుకునే అవకాశం వచ్చింది. అలాగే తెలంగాణ రైల్వే కోచ్ ఫ్యాకర్టీ, ఐటీఐఆర్ లాంటి పరిశ్రమలు, ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల, తెలంగాణలోని ఏదైన ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కించుకోవాలి. అలాగే రెండు రాష్ట్రాల మధ్య 9,10 వ షెడ్యూల్లోని సంస్థలపై పీటముడి ఇప్పటికీ తెగలేదు. పదేళ్ల ఉమ్మడి రాజధాని ముగిసింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. చాలాకాలం కలిసే పనిచేశారు. రాజకీయ పరిస్థితుల వల్ల ఇద్దరూ వేరే పార్టీల్లో ఉన్నా నాటి స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగిస్తూ, ఉభయ రాష్ట్రాల మేలుకోరి పాలన సాగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం సంఖ్యా బలం ఉన్నదని రెండు రాష్ట్రాల విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాంటి మొహమాటాలు అవసరం లేదంటున్నారు. 2014లో గుజరాత్ నమూనా అని అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ యేతర రాష్ట్రాల పట్ల వివక్ష చూపింది. బడ్జెట్లోనూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగిన నిధులు కేటాయించకుండా, ప్రాజెక్టులు ఇవ్వకుండా మొండిచేయి చూపెట్టింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న వర్షకాల సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కానివ్వద్దనేది ప్రజల అభిప్రాయం. దానికి అనుగుణంగా అక్కడ చంద్రబాబు, ఇక్కడ బీజేపీ ఎంపీలు రెండు రాష్ట్రాలకు విభజన చట్టంలో నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తేవాలి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అన్న రాజకీయ వాతావరణం ఉన్నది. ఈ అవకాశాన్ని ఇరు రాష్ట్రాల ఎంపీలు కలిసి కట్టుగా తమ గళాన్ని వినిపించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధాని మోదీ ముందు రెండు రాష్ట్రాల డిమాండ్లను ముందుపెట్టి ఆమోదింపజేసుకోవాలంటున్నారు