• Telugu News
  • /National

Project Cheetah : భారత రాష్ట్రపతికి బోట్స్వానా 8చీతాల బహుమతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బోట్స్వానా 8 చీతాలను బహుమతిగా ఇచ్చింది. ఈ చీతాలు ప్రాజెక్టు చీతా కింద గాంధీ సాగర్ అభయారణ్యంలో చేరనున్నాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Nov 13, 2025, 4:55 pm IST
Read Time: 4 mins
Project Cheetah : భారత రాష్ట్రపతికి బోట్స్వానా 8చీతాల బహుమతి

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బోట్స్వానా దేశ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రభుత్వం ఆమెకు 8చీతాలను అప్పగించింది. ద్రౌపది ముర్ము, బోట్స్యానా దేశాధ్యక్షుడు డూమా గిడియోన్ బోకోల సమక్షంలో 8చీతాలను భారత్ కు అప్పగించారు. మొకోలోడి నేచర్ రిజర్వ్‌లో చీతాల అప్పగింతల తంతు నిర్వహించారు. చీతాల బహుకరణపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ..ఈ బహుమతి భారత్, బోట్స్యనా దేశాల మధ్య పరస్పర అనుబంధాన్ని, సహకారాన్ని మరింత బలోపేతానికి దోహదం చేస్తుందని తెలిపారు.

చీతాలను బహుమతిగా ఇవ్వడం.. బోట్స్వానా దేశానికి వన్యప్రాణుల సంరక్షణపై నిబద్ధతకు ప్రతికగా నిలుస్తుందని కొనియాడారు. ఈ చీతాలు భారతదేశంలోని కునో నేషనల్ పార్క్‌లో తమ సోదరీ, సోదర చీతాలను కలుస్తాయని, ఈ చారిత్రక జాతులను పునరుద్ధరించడంలో మాకు సహాయపడతాయని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పేర్కొన్నారు.

పురోగమనంలో ‘ప్రాజెక్టు చీతా’

భారత్ లో 1952లో అంతరించిపోయినట్లుగా ప్రకటించబడిన చీతా జాతుల చిరుతల పునరుత్పాదన, సంరక్షణకు కేంద్ ప్రభుత్వం 2022సెప్టెంబర్ లో ‘ప్రాజెక్టు చీతా’ ను ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ ఈ ప్రాజెక్టుకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. నమీబియా, దక్షిణాఫ్రికా, బోట్స్వానా వంటి దేశాల నుండి చిరుతలను విడతల వారిగా దిగుమతి చేసుకున్నారు. బోట్స్వానా అందించిన చిరుతలను ఈ ఏడాది చివరినాటికి మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్ అభయారణ్యంలో వదిలే అవకాశం ఉంది. గాంధీ సాగర్ అభయారణ్యం రాజస్థాన్ సరిహద్దులో ఉంది. ఇది చిరుతల పునరావాసానికి అనువైన వాతావరణం కలిగి ఉందని, దీనిని రెండవ ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా తొలుత కునో నేషనల్ పార్క్‌ (మధ్యప్రదేశ్‌)లోకి 20 చీతాలను తెచ్చారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించక వాటిలో 9 చీతాలు మృతి చెందాయి. మిగిలినవి ఇప్పటికీ సజీవంగా ఉండగా, కొన్ని చిరుతలు పిల్లల్ని కన్నాయి. దీంతో పాత, కొత్త చీతాల సంఖ్య 27 కు చేరిందని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. వాటిలో 16 దేశంలోనే పుట్టాయి.