• Telugu News
  • /National

Cabinet Approves For 78 Days PLB And Bihar Development | బిహార్‌లో పలు అభివృద్ది పనులకు ఆమోదం, రైల్వే ఉద్యోగులకు బోనస్: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ బిహార్ అభివృద్ధి ప్రాజెక్టులు, రైల్వే ఉద్యోగులకు బోనస్ ఆమోదం ఇచ్చింది; రైల్వే 2024–25 రికార్డు రవాణా.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Sep 24, 2025, 4:27 pm IST
Read Time: 3 mins
Cabinet Approves For 78 Days PLB And Bihar Development | బిహార్‌లో పలు అభివృద్ది పనులకు ఆమోదం, రైల్వే ఉద్యోగులకు బోనస్: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

బిహార్ లో పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం నాడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్రాల్లో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ. 2,192 కోట్లతో రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. భక్తియార్-రాజ్ గిర్-తిలయ్యా రైల్వే లైన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,822.31 కోట్లతో నాలుగు లైన్ల జాతీయ రహదారుల పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దేశీయ నౌకా నిర్మాణం, సముద్ర రంగాల పునరుజ్జీవనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కోసం రూ. 69. 725 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరో వైపు రైల్వే ఉద్యోగులకు దసరా కానుకను ప్రకటించింది కేంద్రం. 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు రూ.1865. 68 కోట్లు బోనస్ గా అందించనున్నారు. రైల్వే ఉద్యోగులలకు ప్రతి ఏటా బోనస్ చెల్లిస్తారు. ఈ బోనస్ ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డ్స్), స్టేషన్ మాస్టర్లు, సూపర్ వైజర్లు, టెక్నీషీయన్లు, హెల్పర్లు, పాయింట్ మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ సి ఉద్యోగులకు బోనస్ అందుతుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రైల్వే రికార్డు స్థాయిలో సరుకును రవాణా చేసింది. 1,614.90 మిలియన్ టన్ను సరుకును రవాణా చేసి రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు 7.3 బిలియన్ల ప్రయాణీకులు రైళ్లలో ప్రయాణం చేశారు.