CJI : సాంకేతిక పరిజ్ఞానంతోపాటే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి చేతికి మొబైల్ ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్లో ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు అడుగుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకుని సైబర్ నేరగాళ్లు డబ్బులు లాగుతున్నారు.
ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరునే సైబర్ నేరగాళ్లు తమ మోసానికి ఉపయోగించుకునేందుకు కుట్రపన్నారు. ఓ సైబర్ కేటుగాడు సోషల్ మీడియాలో తనను సీజేఐగా పరిచయం చేసుకొని డబ్బులు అడిగిన ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాను సీజేఐని అని, క్యాబ్ ఛార్జీల కోసం తనకు రూ.500 పంపగలరా..? అని మోసపూరిత మెసేజ్ పెట్టాడు.
ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి రావటంతో ఆ సైబర్ మోసంపై మంగళవారం ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. సీజేఐ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ను స్క్రీన్షాట్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చారు. ఆ మోసపూరిత మెసేజ్ను చూసి సీజేఐ చంద్రచూడ్ ఇచ్చిన ఫిర్యాదును సుప్రీంకోర్టు భద్రతా విభాగం పరిగణనలోకి తీసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసుల చేత ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది.
వాస్తవానికి సీజేఐ పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన ఆ మెసేజ్లో ఏముందంటే.. ‘హలో నేను సీజేఐని. కొలీజియం అత్యవసర సమావేశానికి వెళ్లాలి. నేను కన్నాట్ ప్రాంతంలో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం మీరు నాకు రూ.500 పంపగలరా..? నేను కోర్టుకు చేరుకున్న వెంటనే డబ్బులు తిరిగి ఇస్తా’ అని సైబర్ నేరగాడు సీజేఐ పేరిట మెసేజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.