Supreme Court | వక్ఫ్ సవరణ చట్టం కేసు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

విధాత: వక్ఫ్ చట్టం కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీం కోర్టులో వరుసగా రెండో రోజు గురువారం కూడా విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్, వక్ఫ్ వై యూజర్ ఆస్తులను డీనోటీఫై చేయబోమని కేంద్రం తెలిపింది. అయితే, అప్పటివరకు వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 5కు వాయిదా వేసింది.
వక్ఫ్గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో.. ఎక్స్-అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ సూచించింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్-అఫీషియో సభ్యులను నియమించొచ్చని పేర్కొంది. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదనలు చేసింది.
వారం గడువు కోరిన కేంద్రం
వక్ప్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ఇప్పటికే సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తరపున న్యాయవాది తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. కొన్ని సెక్షన్లను మాత్రమే చదివి నిర్ణయం తీసుకోవద్దని ఆయన ధర్మాసనాన్ని కోరారు. చట్ట సవరణలో అనేక సవరణలు, కమిటీల ఏర్పాట్లు, లక్షల సంఖ్యలో అభ్యర్థనలు ఉన్నాయని గుర్తు చేశారు. గ్రామాలకు గ్రామాలను వక్ప్ ఆస్తులుగానూ, వ్యక్తిగత ఆస్తులను తీసుకున్నారని వివరించారు. ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ స్టే ఇవ్వడం కఠినమైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఒక వారం సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అలాగే తన వాదనలతో పాటు డాక్యుమెంట్లను సమర్పించడానికి సైతం అనుమతించాలని విజ్జప్తి చేశారు.
షరతులతో వాయిదా
కేంద్రం ప్రభుత్వం న్యాయవాది తుషార్ మోహతా అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ మేము పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదన్నారు. ఐదేళ్ల వరకు ప్రొవిజెన్స్ ఉన్నాయని తమకు తెలుసునని స్పష్టం చేశారు. వాటిని తాము స్టే చేయడం లేదని స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై ఎస్ జీ తుషార్ మెహతా స్పందిస్తూ దయ చేసి తమ వాదనను వినాలని కోరారు. ఒక వారం రోజుల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు.
అలాగే తాము ఎలాంటి నియామకాలు చేయమని ధర్మాసనానికి విన్నవించారు. ఇంతలో చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకొని తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులు వద్దన్నారు. దీంతో ఎస్ జీ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఏ రాష్ట్రం అయినా.. నియామకాలు చేస్తే.. అవి చట్టబద్దమైనవిగా పరిగణించకూడదన్నారు. తాను ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వారం రోజులు సమయం ఇచ్చింది.
అలాగే తదుపరి విచారణ తేదీ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక తదుపరి విచారణ తేదీ వరకు.. యూజర్ వై వక్ఫ్గా పేర్కొన్నవాటితో పాటు నోటిఫికేషన్ ద్వారా రిజిస్టర్ చేయబడిన వాటిని డీ నోటిఫై చేయకూడదంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. వారం వరకు వక్ఫ్ ఆస్తుల్లో ఎటువంటి మార్పులు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డులో ఎటువంటి నూతన నియామకాలు చేయొద్దని సూచించింది. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో వివరణాత్మక సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టంగా సూచించింది.