Gujarat | ఇరవై రూపాయాలు లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నిర్దోషిని అని నిరూపించుకునేందుకు 30 ఏళ్ల సమయం పటింది. చివరకు నిర్దోషిగా తేలిన రోజే మృతి చెందాడు. ఇది ఓ మాజీ పోలీసు కానిస్టేబుల్ భావోద్వేగపు కథ.
అసలేం జరిగిందంటే..?
1996, సెప్టెంబర్ నెల అది. గుజరాత్ అహ్మదాబాద్లోని వేజల్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసు కానిస్టేబుల్ ప్రజాపతి విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ట్రక్కు డ్రైవర్ నుంచి రూ. 20 లంచం తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు చేపట్టింది. 2004లో అహ్మదాబాద్ జిల్లా కోర్టు.. ఆ కానిస్టేబుల్ను దోషిగా నిర్ధారిస్తూ మూడేండ్ల జైలు శిక్ష విధించింది.
హైకోర్టులో అప్పీల్..
అహ్మదాబాద్ జిల్లా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బాధిత కానిస్టేబుల్ గుజరాత్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. జస్టిస్ ఎస్వీ పింటో నేతృత్వంలో ఈ కేసును విచారణ చేయగా.. సదరు కానిస్టేబుల్ లంచం తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో నిరూపించలేకపోయారు. ఈ క్రమంలో జిల్లా కోర్టు తీర్పును హైకోర్టు రద్దు చేస్తూ ఫిబ్రవరి 4వ తేదీన తీర్పును వెల్లడించింది. కానిస్టేబుల్ను నిర్దోషిగా ప్రకటించింది.
ఆనందంలో సహజ మరణం..
రూ. 20 లంచం కేసులో నిర్దోషిగా తేలడంతో బాధిత కానిస్టేబుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తానికి 29 ఏళ్ల తర్వాత లంచం అనే మరక తన జీవితం నుంచి తొలగిపోయిందంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆనంద సమయంలోనే “ఈ క్షణమే దేవుడు నన్ను తన వద్దకు తీసుకెళ్లుంటే బాగుండేది” అని ప్రార్థించారు. అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయన సహజ మరణం చెందారు.
