• Telugu News
  • /National

గుజరాత్‌లో వింత ఘటన.. బావి నీళ్లలో సముద్రపు అలలు!

గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలో ఓ రైతు బావిలో నీరు పైకి ఉబికి వచ్చి సముద్రపు అలల మాదిరిగా ఎగిసిపడుతుడటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ విచిత్ర దృశ్యం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారడంతో, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు దీనిని చూసేందుకు భారీగా తరలివచ్చారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Aug 07, 2026, 10:46 am IST
Read Time: 4 mins
గుజరాత్‌లో వింత ఘటన.. బావి నీళ్లలో సముద్రపు అలలు!

 

విధాత : ప్రకృతిలో సంభవించే కొన్ని ఘటనలు మానవుల మేధోశక్తికి సవాల్ విసురుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వింత ఘటన గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలో చోటుచేసుంది. ఓ రైతు బావిలో నీరు పైకి ఉబికి వచ్చి సముద్రపు అలల మాదిరిగా ఎగిసిపడుతుడటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ విచిత్ర దృశ్యం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారడంతో, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు దీనిని చూసేందుకు భారీగా తరలివచ్చారు.

మూడు నెలల క్రితం 18అడుగుల మేరకు తవ్విన ఈ బావిలో ఈ ఏడాది మంచి వర్షాల తర్వాత పూర్తిగా నీటితో నిండింది. గ‌త ఆదివారం నుంచి బావి నీరు ఒక్కసారిగా మసకబారుతూ, అలల మాదిరిగా ఊగడం ప్రారంభమైంది. నీళ్లు నిరంతరం కదులుతూ, కొన్నిసార్లు బావి అంచుల నుంచి బయటకు పొంగిపొర్లాయి. బావిలోని నీరు అలల మాదిరిగా ఎగిసిపడుతుండటంతో భూకంపం వస్తుందేమోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే గత 8–10 రోజుల్లో మోర్బీ జిల్లాలో ఎలాంటి భూకంపం లేదా భూగర్భ ప్రకంపనలు నమోదుకాలేదని గాంధీనగర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) పరిశోధకులు స్పష్టం చేశారు.

భూగర్భ శిలల మధ్య చిక్కుకున్న వాయువుపై వర్షపు నీటి ఒత్తిడి పెరగడం వల్లే ఈ కదలికలు ఏర్పడి ఉండొచ్చని జిల్లా జియాలజిస్టులు ప్రాథమికంగా అంచనా వేశారు.అసలు కారణాన్ని గుర్తించేందుకు భూగర్భ జల పరిశోధనా సంస్థ (GWRI) నిపుణులతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాంకేతిక విచారణకు ఆదేశించింది.

ఇటీవల ఈ ప్రాంతంలో, ఎగువన భారీ వర్షాలు కురవడం వల్ల భూగర్భ జలాలు అనూహ్య రీతిలో, అత్యంత వేగంగా రీఛార్జ్ అయ్యాయి. భూగర్భంలో భారీగా నీరు చేరినప్పుడు, అక్కడ ఉన్న రాతి పొరలు, రంధ్రాల మధ్య చిక్కుకున్న గాలిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ గాలి బయటకు రావడానికి మార్గం వెతుక్కునే క్రమంలో నీటిని పైకి తోస్తుంది. బావి దిగువ భాగం నుండి వస్తున్న ఈ గాలి, నీటి ఒత్తిడి వల్ల నీరు ఉపరితలంపై తీవ్ర అలజడి సృష్టిస్తూ ఎగిసిపడుతోందని అంచనాకు వచ్చారు.