Donald Trump : ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు.. ట్రంప్‌ నిర్ణయం భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?

ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25% టారిఫ్ విధిస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా చమురు కారణంగా ఇప్పటికే 50% సుంకాలు ఎదుర్కొంటున్న భారత్‌కు, తాజా నిర్ణయంతో ఎగుమతుల కష్టం మరింత పెరగనుంది.

Donald Trump : ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు.. ట్రంప్‌ నిర్ణయం భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?

సుంకాల (Tariffs) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యా చమురు కొనుగోలు కారణం చూపి భారత్‌ సహా పలు దేశాలపై ఇప్పటికే భారీగా టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌ (Iran)తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ విధిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే ఏ దేశమైనా అమెరికా (America)తో వ్యాపారం చేయాలంటే 25 శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇరాన్‌తో ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కియే, యూఏఈ, ఇరాక్‌, భారత్‌ ఉన్నాయి. ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. భారత్ కూడా కీలక వాణిజ్య భాగస్వామినే. గత ఆర్థిక సంవత్సరంలో ఇరాన్‌కు భారత్ నుంచి 1.24 బిలియన్ డాలర్ల విలువైన సరుకులను ఎగుమతైంది. అదే సమయంలో ఇరాన్ నుంచి 0.44 బిలియన్ డాలర్ల సరుకులను దిగుమతి చేసుకుంది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య మొత్తం 1.68 బిలియన్ డాలర్ల (దాదానె రూ.15 వేల కోట్లు) వాణిజ్యం జరిగింది. ట్రంప్‌ నిర్ణయం భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది.

భారత్ నుంచి ఇరాన్‌కు ఆర్గానిక్‌ కెమికల్స్‌, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి ఎగుమతవుతున్నాయి. ట్రంప్‌ తాజా ప్రకటనతో భారత ఎగుమతిదారులకు నష్టాలు తప్పవని వ్యాపారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ టారిఫ్‌ల కారణంగా ఇప్పటికే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ వ్యాపారంపై కూడా అదనపు టారిఫ్‌లు విధిస్తే.. అమెరికా- భారత్ వాణిజ్య చర్చలు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :


MSG Collections | సంక్రాంతి బాక్సాఫీస్‌కి మెగా జోష్ .. ‘మన శంకరవరప్రసాద్ గారు’తో చిరంజీవి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్
Peddi | యూరప్‌కు ‘పెద్ది’ టీమ్ .. రామ్ చరణ్ కెరీర్‌లోనే కొత్త మలుపు తిప్పనున్న స్పోర్ట్స్ డ్రామా