Lok Sabha Elections | న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు రేపటితో ముగియనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనేది ఆ రోజే తేలిపోనుంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీగా నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయి. ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మే 30వ తేదీ వరకు రూ. 1100 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ద్వారా తెలిసింది. అయితే 2019 సార్వత్రి ఎన్నికలతో పోల్చితే ఇది 182 శాతం అధికమని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రూ. 390 కోట్ల నగదు పట్టుబడింది.
అయితే.. ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా సొమ్ము పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ, కర్ణాటకలో వేర్వేరుగా రూ. 200 కోట్ల కు పైగా నగదు, ఆభరణాలు పట్టుబడి దేశంలోనే అగ్రభాగాన నిలిచాయి. తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో రూ. 150 కోట్లకు పైగా నగడు పట్టుబడింది. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో రూ. 100 కోట్లకు పైగా నగదు, ఆభరణాలు పట్టుబడినట్లు పేర్కొన్నారు.
మార్చి 16వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికల నిర్వహణ కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. దాంతో ఆ రోజే నుంచే ఎన్నికల కోడ్ దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇక ఆదాయ పన్ను శాఖ అధికారులు, పోలీసులు దేశ వ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేసి, అక్రమంగా తరలిస్తున్న నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.