విధాత : దేశ రక్షణకు భారత భారత నావికాదళంలోకి సరికొత్త యుద్ధ నౌక రంగప్రవేశం చేసింది. అధునాతన సాంకేతికతో నిర్మించిన ఐఎన్ఎస్ ఇక్షక్ కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో జల ప్రవేశం చేసింది. ఇక్షక్ జల ప్రవేశ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి హాజరయ్యారు.
భారత నేవీ ఫోర్స్ లో ఐఎన్ఎస్ ఇక్షక్ చేరికతో సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు పడింది. ఈ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ సంస్థ.. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. హైడ్రోగ్రాఫిక్ సర్వే కార్యకలాపాలతోపాటు..మానవతా సహాయం, విపత్తు సహాయకారిగానూ.. అత్యవసర సమయాల్లో హాస్పిటల్ షిప్గా కూడా వ్యవహరించనుంది. భారత దేశ సముద్ర శక్తిని మరింత బలోపేతం చేసేలా ఇక్షక్ నిర్మాణం జరిగింది.
ఇక్షక్ అంటే అర్ధం…
ఇక్షక్ అంటే ది గైడ్.. దిక్సూచీ అని అర్థం. తెలియని మార్గాల్ని అన్వేషించడం.. నౌకాదళాన్ని సరైన దారిలో నడిపించడం.. తమ లక్ష్యాల్ని సురక్షితంగా చేరుకునేలా నావికులకు మార్గాన్ని నిర్దేశించడం. ఓడరేవులు, నావిగేషనల్ చానెల్లు, ఎకనావిుక్ ఎక్స్క్లూజివ్ జోన్లో కోస్టల్, డీప్ వాటర్ హైడ్రో–గ్రాఫిక్ సర్వే నిర్వహించడం, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో ఇక్షక్ కీలక పాత్ర పోషించనుంది.
ఇక్షక్ ప్రత్యేకతలు
ఇక్షక్ పొడవు 110 మీటర్లు, బరువు 3,400 టన్నులు, వేగం గంటకు 33 కిమీ (18 నాటికల్ మైళ్లు), సామర్థ్యం 30 కిమీ వేగంతో ఏకధాటిగా 12 వేల కిమీ దూరం ప్రయాణించగలదు. సముద్రంలో 25 రోజుల పాటు తీరానికి రాకుండా పహారా కాయగల సత్తా దీని సొంతం. 231 మంది సిబ్బందితో ప్రయాణిస్తుంది. సీఆర్ఎన్91 నేవల్ గన్, హాల్ ధృవ్ ఎంకే–3 హెలికాప్టర్ వంటి ఆయుధాలను మోసుకెళ్లి వినియోగించే సామర్ధ్యం ఉంది. ఇన్బుల్ట్ సెన్సార్ శక్తిలో అటానమస్ అండర్ వాటర్ వెహికల్ సెన్సార్, హైడ్రోగ్రాఫిక్ సెన్సార్ పరికరాలు, సముద్ర కాలుష్యాన్ని గణించే మార్పల్ వ్యవస్థ, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్(ఆర్వోవీ), సైడ్ స్కాన్ సోనార్ వంటి సామర్ధ్యాలను కలిగి ఉంది.
మహిళల కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్
భారత నౌకాదళ చరిత్రలో మహిళల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేసిన తొలి యుద్ధ నౌక ఇక్షక్. ఇప్పటి వరకూ ప్రతి యుద్ధ నౌకలో మహిళా అధికారులు, సెయిలర్స్కు పురుష సిబ్బందితో కలిసి పక్కపక్కనే విడిగా గదులు ఉండేవి. ఇక్షక్లో మాత్రం.. మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు.
తదుపరి వచ్చేది..సంశోధక్
సంధాయక్ సర్వే వెసల్ నౌక 1968నుంచి భారత నౌకాదళంలో విశిష్ట సేవలందించి 2021లో సేవల నుంచి వైదొలిగింది. ఇండియన్ నేవీకి సర్వే నౌకల ప్రాధాన్యతను గుర్తించిన రక్షణ మంత్రిత్వ శాఖ.. 2017లో నాలుగు సంధాయక్ క్లాస్ సర్వే వెసల్స్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. రూ.2,435.15 కోట్లతో బిడ్ను జీఆర్ఎస్ఈ దక్కించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకల్ని నిర్మిస్తున్నారు. వీటిలో మొదటిది జే18 పేరుతో ఐఎన్ఎస్ సంధాయక్ని 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. జే 19 పేరుతో ఐఎన్ఎస్ నిర్దేశిక్ను, జే23 పేరుతో ఇక్షక్ని 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తర్వాత ఐఎన్ఎస్ సంశోధక్ షిప్ 2026 నాటికి భారత నౌకాదళంలో చేరాలన్నది ప్రణాళిక నిర్ణయించారు.
