Supreme Court | సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న 'ఈవీఎం-వీవీప్యాట్' క్రాస్ వెరిఫికేషన్ అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు చెప్పింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (EVM) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో రెండు తీర్పులు వెల్లడించింది.
Supreme Court : సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ‘ఈవీఎం-వీవీప్యాట్’ క్రాస్ వెరిఫికేషన్ అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు చెప్పింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (EVM) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో రెండు తీర్పులు వెల్లడించింది.
ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రొటోకాల్లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అదే సమయంలో ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీచేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని తెలిపింది. సీల్ చేసిన ఈవీఎంను కనీసం 45 రోజులపాటు భద్రపర్చాలని సూచించింది.
ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది. అప్పుడు ఇంజినీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని తెలిపింది. ఈ వెరిఫికేషన్కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే సదరు అభ్యర్థికి ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది.
తీర్పు సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం అనవసర అనుమానాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్ ఖన్నా ఈసీకి తెలిపారు. అంతేగాక ప్రతి పార్టీ పక్కన గుర్తుతోపాటు బార్కోడ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్స్ డిమాండ్ చేస్తున్నారు.