• Telugu News
  • /National

Kangra train bridge collapse | వీడియో : వేల మందితో రైలు వెళుతుంటే.. కూలిపోయిన వంతెన బేస్‌..

ఇంటర్నట్‌లో ఒక వీడియో ఒళ్లుగగుర్పొడిచేలా చేస్తున్నది. వేల మందితో వెళుతున్న రైలు.. అదృష్టవశాత్తూ తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కంగ్రా వద్ద చక్కీ నది వద్ద ఈ భయానక దృశ్యాన్ని కొందరు వీడియోలో బంధించి సోషల్‌ మీడియాలో ఉంచారు.

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | Jul 21, 2025, 4:44 pm IST
Read Time: 5 mins
Kangra train bridge collapse | వీడియో : వేల మందితో రైలు వెళుతుంటే.. కూలిపోయిన వంతెన బేస్‌..

ఇంటర్నట్‌లో ఒక వీడియో ఒళ్లుగగుర్పొడిచేలా చేస్తున్నది. వేల మందితో వెళుతున్న రైలు.. అదృష్టవశాత్తూ తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కంగ్రా వద్ద చక్కీ నది వద్ద ఈ భయానక దృశ్యాన్ని కొందరు వీడియోలో బంధించి సోషల్‌ మీడియాలో ఉంచారు. వంతెనపై రైలు మెల్లగా వెళుతున్న సమయంలో ఎదురు ఒడ్డున బ్రిడ్జ్‌ బేస్‌ క్షణాల వ్యవధిలో కూలిపోయింది. ఇటీవలి వర్షాలకు చక్కీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆ ప్రవాహ తీవ్రతకు వంతెన బేస్‌మెంట్‌ కింద భూమి.. కోతకు గురై.. మూడు భాగాలుగా అది కూలిపోయింది. సరిగ్గా అదే సమయంలో వంతెనపై నుంచి రైలు వెళుతూ ఉన్నది. అయితే.. వంతెనకు ఎలాంటి నష్టం కలుగకపోవడంతో రైలు సాఫీగా వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆ వీడియోలో మొదట వంతెనపైకి రైలు రావడం కనిపిస్తుంది. వంతెన కింద చక్కీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. క్షణాల వ్యవధిలోనే నది ఒడ్డున కట్టిన బేస్‌లో కొంత భాగం కూలిపోవడం కనిపిస్తుంది. కాసేపటికే మరో భాగంగా కూడా కూలిపోవడంతో ఒక్కసారిగా వేల మంది ప్రాణాలు రిస్క్‌లో పడ్డాయి. అదృష్టవశాత్తూ ఆ రైలు ఎలాంటి ప్రమాదం లేకుండానే వంతెనను దాటేసింది.

కాంగ్రాలోని ధంగు వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. పఠాన్‌కోట్‌కు ఈ ప్రాంతం సమీపంలో ఉంటుంది. వర్షాల నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ అయి ఉన్నది. చక్కీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. దీంతో సమీప బేస్‌ బాగా నానిపోయి.. దాని కింద మట్టి వదులుగా మారడంతో అది నదీ ప్రవాహం వేగానికి కోతకు గురైంది. కొద్ది రోజుల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురియడంతో వివిధ కారణాలతో 78 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. కొందరి ఆచూకీ ఇంకా తెలియనేలేదు. జూన్‌ 20వ తేదీ నుంచి మెరుపు వరదలు, కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని కుదిపివేస్తున్నాయి. అనేక ఇళ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. జూలై ఆరు నాటికి హిమాచల్‌ప్రదేశ్‌లో 23 మెరుపు వరదలు, 19 కుండపోత వానలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలు 16 చోటుచేసుకున్నాయి. మృతుల్లో 50 మంది నీళ్లలో మునిగిపోయి, విద్యుత్‌ షాక్‌లకు గురై, పిడుగులు పడి చనిపోయినవారే ఉన్నరు. వర్షాల సమయంలో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో మరో 28 మంది చనిపోయారు. 37 మంది జాడ ఇంకా తెలియడం లేదని రాష్ట్ర డిజాస్టర్‌ మేనేమెంట్‌ అథారిటీ ప్రకటించింది. వేర్వేరు ఘటనల్లో 115 మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి..

Brain Stroke | బీ ఫాస్ట్ సూత్రంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ను అరికట్టొచ్చు!
Rain Revives Crops Telangana  | ‘బంగారు వాన’తో రైతన్నకు మురిపెం..