ఉత్తరప్రదేశ్ బీజేపీలో అంతర్గత కలహాలు వీధికెక్కుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంలో వైరివర్గాల మధ్య కుమ్ములాటలకు సంకేతాలుగా నిలుస్తున్నాయి
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీలో అంతర్గత కలహాలు వీధికెక్కుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంలో వైరివర్గాల మధ్య కుమ్ములాటలకు సంకేతాలుగా నిలుస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం మౌర్య తన ఎక్స్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వం కంటే పార్టీయే పెద్దది. పార్టీ కార్యకర్తలకు కలిగిని బాధ నా బాధ. పార్టీకంటే ఎవరూ పెద్ద కాదు. కార్యకర్తలు మాకు గర్వకారణం’ అని వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయంగా తలో విధంగా చర్చించుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరితో కూడా నడ్డా ఢిల్లీలో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్తో విభేదాల నేపథ్యంలో మౌర్యకు పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
మౌర్య ఎక్స్ పోస్టును ఆధారం చేసుకుని బీజేపీపై సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేశారు. అంతర్గత వైరుధ్యాలతో బీజేపీ ప్రభుత్వం సతమతమవుతున్నదని అన్నారు. ‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో కుమ్ములాడుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం స్థిరంగా లేదు. అధికారం కోసం సాగే పోరులో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తున్నది. రాజధాని లక్నోలో ఇళ్ల కూల్చివేత నిర్ణయం వాయిదా వేశారు. ప్రభుత్వం బాగా బలహీనపడిందనేందుకు ఇది స్పష్టమైన సంకేతం’ అని అఖిలేశ్ యాదవ్ ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.
అయితే అఖిలేశ్ వ్యాఖ్యలపై మౌర్య తీవ్రంగా స్పందించారు. ‘ఎస్పీ బహదూర్ శ్రీ అఖిలేశ్ యాదవ్ జీ.. బీజేపీ బలమైన సంస్థ. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది. ఎస్పీ పీడీఏ మోసపూరితం. యూపీలో మళ్లీ గూండారాజ్యం అసంభవం. 2027 ఎన్నికల్లో బీజేపీ 2017ను మళ్లీ పునరావృతం చేస్తుంది’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. యూపీలో త్వరలో పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో 9 సీట్లు అక్కడి ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వాటిలో అఖిలేశ్ యాదవ్ ప్రాతినిథ్యం వహించిన కర్హాల్ కూడా ఉన్నది. కన్నౌజ్ ఎంపీగా గెలుపొందడంతో అఖిలేశ్ యాదవ్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
డిసెంబర్లో బీజేపీ అధ్యక్ష ఎన్నిక
సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ముగించుకున్న అనంతరం డిసెంబర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాల నేపథ్యంలో ఈసారి అధ్యక్ష ఎన్నికపై ఆ పార్టీ మాతృ సంస్థ ఆరెస్సెస్ ప్రభావం గట్టిగా ఉంటుందని అంటున్నారు. కొత్త అధ్యక్షుడిగా దళితుడు లేదా ఓబీసీ నేతను ఎన్నుకునే అవకాశం ఉన్నదని పార్టీ నేతలు చెబుతున్నారు. వీరుకాని పక్షంలో ఈసారి మహిళకు కూడా పార్టీ పగ్గాలు దక్కే అవకాశం లేకపోలేదని అంటున్నారు.