ఇండోర్ ఐటీ క్యాంప‌స్‌లో చిరుత హ‌ల్‌చ‌ల్‌

మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్‌ సమీపంలో మంగ‌ళ‌వారం చిరుతపులి హ‌ల్‌చ‌ల్ సృష్టించింది. చిరుత క‌నిపించ‌డంతో ఉద్యోగులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు

ఇండోర్ ఐటీ క్యాంప‌స్‌లో చిరుత హ‌ల్‌చ‌ల్‌
  • బెంబేలెత్తిన ఐటీ కంపెనీల ఉద్యోగులు
  • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్

విధాత‌: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్‌ సమీపంలో మంగ‌ళ‌వారం చిరుతపులి హ‌ల్‌చ‌ల్ సృష్టించింది. క్యాంప‌స్‌లో చిరుత క‌నిపించ‌డంతో ఐటీ ఉద్యోగులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అట‌వీశాఖ అధికారుల‌ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు రెండు ఐటీ కంపెనీల ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.

ఇండోర్‌లోని ఐటీ కారిడార్ ప్రాంతంలో మంగ‌ళ‌వారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య చిరుతపులి కనిపించిందని, ప్రస్తుతం అటవీ శాఖ రెస్క్యూ టీమ్ ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో వెతుకుతున్నట్టు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి బయటకు రావద్దని హెచ్చరించినట్టు పేర్కొన్నారు.

ఇండోర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) ఎంఎస్ సోలంకి మీడియాతో మాట్లాడుతూ.. “సూపర్ కారిడార్ ప్రాంతంలోని టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్‌ల సమీపంలో చిరుతపులి కనిపించినట్లు మాకు సమాచారం అందింది. మేము రెస్క్యూ టీమ్‌ను పంపాము చిరుత జాడ కోసం వెతుకుతున్నారు” అని తెలిపారు.