Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో భాగంగా జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్‌ జరుగుతున్నది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్‌ కొనసాగుతోంది. శ్రీనగర్లోని ఓ పోలింగ్‌ బూత్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

శ్రీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (NC) అగా సయ్యద్‌ రుహువుల్లా మెహదీని బరిలో దింపింది. ఇక్కడి నుంచి మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ వహీద్‌ ఉర్‌ రెహమాన్‌ పారాను, జమ్ముకశ్మీర్‌ అప్నీ పార్టీ మహమ్మద్‌ అష్రఫ్‌ మిర్‌ను బరిలో నిలిపాయి. ఓటేసిన అనంతరం పోలింగ్‌ బూత్‌ నుంచి బయటికి వచ్చిన ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా తమ వేళ్లపై సిరా గుర్తులను చూపించారు.

ఈ సందర్భంగా ఫరూఖ్‌ అబ్దుల్లా మాట్లాడుతూ బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో హింస లేదని, అంతా ప్రశాంతంగా ఉందని కేంద్ర ప్రభుత్వ నాయకులు చెబుతుండటం బాధాకరమని అన్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి తమ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలను ఇళ్లలోనే నిర్భంధించారని, దాని వల్ల వాళ్లు చాలా నష్టపోయారని, వారిని ఎందుకు నిర్బంధించారో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాని నరేంద్రమోదీ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.