Ragging Horror | సీనియర్ల ర్యాగింగ్కు ఓ జూనియర్ తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఫస్టియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ చేత 300 గుంజిలు తీయించారు సెకండియర్ విద్యార్థులు. దీంతో బాధిత విద్యార్థి కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఇప్పటికే అతనికి నాలుగు సార్లు డయాలసిస్ చేయాల్సి వచ్చింది.
Ragging Horror | జైపూర్ : సీనియర్ల ర్యాగింగ్కు ఓ జూనియర్ తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఫస్టియర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ చేత 300 గుంజిలు తీయించారు సెకండియర్ విద్యార్థులు. దీంతో బాధిత విద్యార్థి కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఇప్పటికే అతనికి నాలుగు సార్లు డయాలసిస్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్లోని దుంగార్పూర్ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది మే 15వ తేదీన చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ విద్యార్థి గతేడాది సెప్టెంబర్లో దుంగార్పూర్ మెడికల్ కాలేజీలో చేరాడు. ఇక సెకండియర్కు చెందిన ఏడుగురు విద్యార్థులు కలిసి.. ఆ విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. మే 15వ తేదీన అతనిచే ఒకేసారి 300 గుంజిలు తీయించారు. దీంతో బాధిత విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
300 గుంజిలు తీయడం వల్ల అతని మూత్రపిండాలపై ప్రభావం పడడంతో అవి దెబ్బతిన్నాయి. చివరకు అహ్మదాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. నాలుగు సార్లు డయాలసిస్ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
ఈ ఘటనపై మెడికల్ కాలేజీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. జూనియర్ను ర్యాగింగ్ చేసిన ఏడుగురు సీనియర్లపై కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.