కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగానికి శుభవార్త అందించింది. ప్రతి ఏటా రైతులకు మూడు దఫాలుగా అందిస్తున్న రూ.6000సహాయానికి సంబంధించిన పీఎం కిసాన్ పథకాన్ని.. మరో ఐదేళ్లు కొనసాగించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం కొనసాగించనున్నారు.
ఇందుకోసం రానున్న ఐదేళ్లకు గాను రూ.3.15లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుందని, ఇందులో భాగంగా వివిధ పథకాలకు 4,50,988 కోట్ల రూపాయల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన 5070 కోట్లు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 3,15,614 కోట్లు, ఖేలో ఇండియా పథకం నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీంకు 36,441 కోట్లు కేటాయించింది. సముద్ర మంతన్ పథకానికి 84,084 కోట్ల రూపాయలు, యూని డైరెక్షనల్ ట్విన్ ట్యూబ్ టన్నుల్స్ నిర్మాణానికి 9,779 కోట్ల రూపాయల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
అలాగే పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ముడిచమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాకు, ఎరువుల అవసరాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, తాజా బిల్లుల వ్యూహాలపై కీలక చర్చలు జరిగినట్లుగా సమాచారం.
