Pregnant Woman | నెలలు నిండిని గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. ఆ నొప్పులను భరించలేకపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లే వారెవరూ లేరు. భర్త ఇప్పటికే మరణించడంతో.. దిక్కుతోచని స్థితిలో కత్తితో పొత్తి కడుపును కోసుకుంది. అదే సమయంలో సాధారణ ప్రసవం ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బహ్రెచ్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బహ్రెచ్ జిల్లా బౌండీ పోలీసు స్టేషన్ పరిధిలోని నంద్వాల్ గ్రామానికి చెందిన నాన్కీ(35) అనే మహిళ కొన్నేండ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్త ఆరు నెలల క్రితం అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికే నాన్కీ గర్భిణి. భర్త చనిపోయాక ఒంటరిగానే జీవిస్తోంది. అయితే ఆమెకు ఇటీవలే నెలలు నిండాయి.
గురువారం మధ్యాహ్నం నాన్కీకి పురిటినొప్పులు వచ్చాయి. ఆ నొప్పులు భరించలేక అరిచి అరిచి అల్లాడిపోయింది. చివరకు కూరగాయలు కోసే కత్తి తీసుకొని పొత్తి కడుపుకును స్వయంగా కోసుకుంది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ గట్టిగా కేకలు వేసింది. అప్పటికే సాధారణ ప్రసవం ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
నాన్కీ అరుపులు విని అప్రమత్తమైన స్థానికులు.. ఇంట్లోకి వచ్చి వెంటనే శిశువుతోపాటు ఆమెను ఫఖర్పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. నాన్కీ కడుపులో లోతైన గాయం ఉండడంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం లక్నో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పొత్తి కడుపుకు బలమైన గాయం అయిందని, పేగులు బయటకు వచ్చాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పసిబిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
