• Telugu News
  • /National

Droupadi Murmu : రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గగన విహారం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. రఫేల్‌లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె రికార్డు సృష్టించారు. 2023లో సుఖోయ్‌-30లో ప్రయాణించిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె నిలిచారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Oct 29, 2025, 12:32 pm IST
Read Time: 3 mins
Droupadi Murmu : రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గగన విహారం

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రఫేల్ యుద్ద విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు. పాకిస్తాన్ పై భారత్ మే నెలలో నిర్వహించిన నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో రఫేల్ యుద్ద విమానాలు కీలక పాత్ర పోషించాయి. పాక్ లోని ఉగ్ర వాద శిబిరాలను ఈ విమానాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. తాజాగా రాష్ట్రపతి ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేయడంతో ఈ విమానం సామర్ధ్యంపై మరింత ఆసక్తి పెరిగింది.

రఫేల్ యుద్ద విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము రికార్డు సృష్టించారు. అంతకుముందు 2023 మే 8న ద్రౌపదీ ముర్ము అస్సాంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించారు. ఈ ప్రయాణం చేసిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు సాధించారు. మొదట 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఇదే ఫైటర్‌జెట్‌లో ప్రయాణించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కూడా 2006లో పుణె వాయుసేన స్థావరం నుంచి సుఖోయ్‌-30 యుద్ధ విమానంలో విహరించడం విశేషం.