Rahul Gandhi On Vote Chori | ఓటర్ల తొలగింపు ఆన్‌లైన్‌లో! సీఐడీ దర్యాప్తును అడ్డుకుంటున్న సీఈసీ: రాహుల్‌.. త్వరలో హైడ్రోజన్‌ బాంబు!

ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ఆరోపణలు, ఈసీ ఖండన. కాంగ్రెస్-బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Rahul Gandhi On Vote Chori | ఓటర్ల తొలగింపు ఆన్‌లైన్‌లో! సీఐడీ దర్యాప్తును అడ్డుకుంటున్న సీఈసీ: రాహుల్‌.. త్వరలో హైడ్రోజన్‌ బాంబు!

Rahul Gandhi On Vote Chori | ఓట్‌ చోరీ అనేది ఒక పద్ధతి ప్రకారం సాగుతున్నదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ ఓట్‌ చోరీకి పాల్పడినవారిని కేంద్ర ఎన్నికల సంఘం కాపాడుతున్నదని పునరుద్ఘాటించారు. గతంలో ఆటం బాంబు పేలుతుందన్న రాహుల్‌.. తదుపరి హైడ్రోజన్‌ బాంబు లాంటి వివరాలతో వస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓట్‌ చోరీ విషయంలో రెండో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించిన ఓటర్లను వేదికపై మీడియాకు చూపించారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓట్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ కొన్ని ఆధారాలు చూపించారు. ఈ నియోజకవర్గంలో 6,018 ఓట్లను తొలగించారని చెప్పారు. వేరే ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి ఈ ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఈ తతంగం మొత్తం నడిపిస్తున్నారని విమర్శించారు. త్వరలో హైడ్రోజన్‌ బాంబుతో వస్తామని, అందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని వెల్లడించారు.

సీఐడీ విచారణను అడ్డుకుంటున్న సీఈసీ

కర్ణాటకలో ఓట్ల తొలగింపుపై సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారని రాహుల్‌గాంధీ చెప్పారు. వీటి ప్రాతిపదికగా ఇన్వెస్టిగేట్‌ చేసేందుకు సీఐడీకి తగిన వివరాలు ఇవ్వకుండా సీఈసీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొన్ని వివరాలు అడుగుతూ సీఈసీకి 18 లెటర్లు రాసినా స్పందన లేదని చెప్పారు. సాకులు చెప్పడం మాని.. సీఐడీ కోరిన సమాచారం ఇవ్వాలని సూచించారు. ఓట్ల చోరీకి పాల్పడిన వ్యక్తులను, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నవారిని సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ కాపాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఫారాలు నింపిన ఐపీ అడ్రస్‌లు, ఓటీపీ వివరాలు ఇవ్వాలని పద్ధెనిమిది నెలల కాలంలో సీఐడీ 18 లేఖలను కేంద్ర ఎన్నికల సంఘానికి రాసింది. కానీ.. ఎన్నికల సంఘం ఈ వివరాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ కేంద్రీకృత ఆపరేషన్‌ మొత్తం ఎక్కడ నుంచి నడిచిందో మాకు తెలిసిపోతుందనే. అసలు ప్రశ్న.. ‘ఆ కొందరు ఎవరు?’. ఈ ప్రశ్నకు సమాధానం ఎన్నికల కమిషన్‌కు తెలుసు. కానీ.. ఆ సమాచారం పంచుకోవడానికి ఈసీకి ఇష్టం లేదు’ అని రాహుల్ అన్నారు. ఈ పని ఎవరు చేశారో కర్ణాటక సీఐడీకి చెప్పడానికి సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ చెప్పడం లేదు’ అని రాహుల్‌ తెలిపారు.

సాఫ్ట్‌వేర్‌ వాడి ఓట్లు తొలగిస్తున్నారు

వ్యక్తులతో కాకుండా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. కాంగ్రెస్ ఓటర్లుగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియ సాగిందని చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్న బూత్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందని.. తద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీన పడిందని రాహుల్ గాంధీ తెలిపారు.

ఫారాన్ని 36 సెకన్లలో నింపేశారు!

ఒక నిర్దిష్ట కేసును ప్రస్తావించిన రాహుల్‌ గాంధీ.. ‘ఒక వ్యక్తి తెల్లవారుజామున 4.07 గంటలకు నిద్రలేచి, డిలీషన్‌ ఫామ్‌ను కేవలం 36 సెకన్లలో నింపాడు. ఈ దేశ యువతను నేను కోరుతున్నా.. 36 సెకన్లలో ఫామ్‌ను నింపేందుకు ప్రయత్నించి చూడండి. ఇది కచ్చితంగా కేంద్రీకృత స్థాయిలో, ఒక కాల్‌ సెంటర్‌లో జరిగింది’ అని చెప్పారు. అత్యధికంగా ఓటర్ల తొలగింపు కాంగ్రెస్‌కు బలమున్న ప్రాంతాల్లోనే చేశారని ఆరోపించారు. ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నవారిని వాళ్లు రక్షిస్తున్నారని యువతకు నేను చెప్పదల్చుకున్నా’ అని అన్నారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని.. అదంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతోందన్నారు. వ్యక్తులతో గాకుండా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఓటర్లను లిస్ట్ నుంచి తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. చాలా ప్రాంతాల్లో మైనార్టీలు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారన్నారు. దీనికి సంబంధించి తాము 100 శాతం ఆధారాలను గుర్తించామని వెల్లడించారు. తాను ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక ప్రక్రియను విశ్వసిస్తానని.. అయితే ఈ రకమైన లక్ష్యపూరిత తప్పులపై ఎలా స్పందించాలనేది మీ చేతుల్లోనే ఉంటుందన్నారు.

ఇది ఓటర్ల హక్కులపై కుట్ర

ఇది కేవలం ఓట్ల జాబితా సమస్య కాదని, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో తేడాలు, అక్రమాలు సరిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ చీకటి రాజకీయం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో జరిగిన ఓటర్ల తొలగింపులపై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుందని విమర్శించారు. ఎన్నికల సంఘం ఒక వారంలోపు తీసివేసిన ఓటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్ రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నవారిని రక్షిస్తున్నారని భావించాల్సి ఉంటుందని తెలిపారు. ‘ఈ సమాచారం ఎన్నికల కమిషన్‌ వర్గాల నుంచే వస్తున్నది. ఇది ఆగబోదు’ అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలని, రాహుల్‌గాంధీ ఒక్కడి వల్లే కాదని అన్నారు.

రాహుల్ ఆరోపణలు అవాస్తవం : ఎన్నికల సంఘం
ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఉపయోగించి ప్రతిపక్ష ఓటర్లను, ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు అవాస్తవమని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అదంతా నిరాధార, అసత్య ప్రచారమని తెలిపింది. ఆన్‌లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

రాహుల్ విమర్శలపై బీజేపీ మండిపాటు
ఓట్ల తొలగింపుపై రాహుల్ చేసిన ఆరోపణలు అమిత్ షా ఖండించారు. బీహార్‌లో అక్రమ ఓటర్లను తొలగించడానికే ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. బీజేపీపై అబద్ధాలను వ్యాప్తి చేసి కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. రాహుల్‌కు రాజ్యాంగం, చట్టం అర్థం కావడం లేదని మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనురాగ్ ఠాకూర్ సైతం రాహుల్ గాంధీ ఆరోపణలను కొట్టిపారేశారు.