Royal Bengal Tiger | దేశ వ్యాప్తంగా పులుల జనాభా గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాల్లో పులుల జాడనే లేదు. రెండు దశాబ్దాల తర్వాత ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో రాయల్ బెంగాల్ టైగర్ ప్రత్యక్షమైంది. 20 ఏళ్ల తర్వాత పాసిఘాట్ ఏరియాలో రాయల్ బెంగాల్ టైగర్ కెమెరా కంటికి చిక్కినట్టు అరుణాచల్ ప్రదేశ్ డీ ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ (DEMWS) అధికారికంగా ప్రకటించింది.
అరుణాచల్ప్రదేశ్లోని రిజర్వ్ ఫారెస్ట్లో చివరిసారిగా 2005లో రాయల్ బెంగాల్ టైగర్ కనిపించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. 2007-08 మధ్య కాలంలో బెంగాల్ టైగర్ ఉందని ఊహించారే కానీ.. అధికారికంగా గుర్తించలేదు. 2014లో వెల్లడైన బేస్ లైన్ సర్వేలోనూ పులులకు సంబంధించిన ఎలాంటి పాదముద్రలు కానీ, వాటి సంచారం కానీ కెమెరా కంటికి చిక్కలేదని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతంలో వేటగాళ్ల కారణంగానే పులుల సంచారం లేకుండా పోయిందని తేలింది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఏడాది జనవరి నెలలో పులుల సంచారం మొదలైంది. అసోం – అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని కొబు చపోరి ప్రాంతంలో రాయల్ బెంగాల్ టైగర్ పాదముద్రలను గురించామని, అది కెమెరా కంటికి చిక్కిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
అరుణాచల్ ప్రదేశ్లోని ఈస్ట్ సెయింగ్ జిల్లా పరిధిలోని పాసిఘాట్కు 13 కిలోమీటర్ల దూరంలో డీ ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఉంది. ఇది 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ శాంక్చువరీని 1978లో స్థాపించారు. సెయింగ్, సిబ్యా నదుల మధ్య ఉన్న ఈ శాంక్చువరీ పులులకు, చిరుతలకు, అడవి బర్రెలకు, వలస పక్షులకు ఆవాసంగా ఉంది.
