సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం.. అభిజిత్‌ దీక్ష ప్రారంభం

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయగా, ఆయన స్థానంలో అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు.

న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ చేపట్టిన దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ వెంటనే ఆయన స్థానంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే దీక్ష ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. కొన్ని వారాల క్రితం కాక్రోచ్‌ పార్టీ తొలుత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారు. సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించిన వెంటనే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్బంగా అభిజిత్ మాట్లాడుతూ…సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించడంతో ఈ ఉద్యమం ఆగిపోదని వెల్లడించారు.మేం ఇక్కడే ఉంటాం.. పోరాటం కొనసాగిస్తాం అన్నారు. ఎల్లుండి 20వ తేదీన పార్లమెంట్‌ వరకు పాదయాత్ర చేసి తీరుతాం.. ఈ ఉద్యమం మరింత విస్తరిస్తుందని ప్రకటించారు. పార్లమెంటు వర్షకాల సమావేశాల తొలి రోజునే కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్ కు పిలుపునివ్వడంతో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి.

ఆసుపత్రిలో వాంగ్ చుక్..

నిరాహార దీక్షతో నిరసించిన వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వైద్య చికిత్సల కోసం చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. నిరాహార దీక్ష కారణంగా వాంగ్ చుక్ బలహీనపడ్డారు. డీహైడ్రేషన్‌కు గురయ్యారు. నిరంతర వైద్యపర్యవేక్షణ, చికిత్స అందిచాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

Latest News