ముంబై: బడ్జెట్ నేపథ్యంలో ఒక్కసారిగా పతనమైన బెంచ్ మార్క్ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం గణనీయంగా పుంజుకున్నాయి. ఈ వారంతాన్ని సుఖాంతం చేసే దిశగా సాగుతున్నాయి. ఎఅండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ 26.07.2024 మధ్యాహ్నం 1.18 సమయానికి 1,100.91 పాయింట్లు పెరిగి.. 81,140.70 వద్ద ట్రేడవుతున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 358.90 పాయింట్లు పెరిగి.. 24,765 వద్ద ట్రేడవుతున్నది. స్మాల్క్యాప్, మిడ్క్యాప్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. 2శాతం పెరిగి.. గణనీయంగా కోలుకున్నాయి.
బడ్జెట్ తర్వాత పడిపోయిన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో మొత్తంగా స్టాక్మార్కెట్ కోలుకున్నది. ఐటీ, మెటల్, ఫార్మా స్టాక్స్ లాభాలు సాధించాయి. అంచనాల కంటే మెరుగైన ఫలితాల క్యూ1 రిజల్ట్స్తో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ర్యాలీ కావడంతో నిఫ్టీ ఐటీ 2 శాతం పెరిగింది.అమెరికా జీడీపీ క్యూ2 సానుకూల సంఖ్యలు కూడా దేశీయ ఐటీ స్టాక్స్కు ఊతమివ్వడంలో కీలక పాత్ర పోషించాయి.
నిఫ్టీ మెటల్ దాదాపు 3 శాతం పెరిగింది. నిఫ్టీ ఫార్మా కూడా బెంచ్మార్క్ సూచీలపై లాభాలకు దోహదపడ్డాయి. దివి ల్యాబొరేటరీస్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్, హెసీఎల్టెక్, కొటక్ మహింద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్ వ్యక్తిగత షేర్ల పెరుగుదల కూడా బెంచ్మార్క్ సూచీలకు ఊతమిచ్చాయి.
దేశీయ స్టాక్మార్కెట్లపై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయ్కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని రకాల ఆందోళనలను అధిగమించే సామర్థ్యం ఇండియాలోని ప్రస్తత బుల్ మార్కెట్ ప్రత్యేకత అని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ఆందోళనలు, బడ్జెట్, మదర్ మార్కెట్ అమెరికాలో కరెక్షన్పై అన్ని ఆందోళనలను మార్కెట్ తోసిపుచ్చిందన్నారు. ‘బై ఆన్ డిప్స్’ వ్యూహం ర్యాలీ కొనసాగేందుకు దోహదం చేసిందని చెప్పారు. బడ్జెట్ ప్రకటనల ప్రభావం నుంచి మార్కెట్లు బయటపడ్డాయని, మిగిలిన క్యూ 1 రిజల్ట్స్ రాబోయే వారపు దలాల్ స్ట్రీట్ సెంటిమెంట్లపై గణనీయంగా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
Stock Market | హమ్మయ్య.. కోలుకున్న స్టాక్మార్కెట్లు.. సుఖాంతం దిశగా వారాంతం!
