Site icon vidhaatha

దేశ ప్ర‌గ‌తికి ఉచితాలు మంచివి కావు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విద్య,.వైద్యం వరకే పరిమితం కావాలి
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ : ఉచిత పథకాలు..పార్టీ ఫిరాయింపులపై మాజీ ఉప రాష్ట్రపతి, పద్మవిభూషణ్ ఎం.వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలు, ప్రభుత్వాలు అధికారం కోసం ఇష్టారాజ్యంగా ఉచిత పథకాల వాగ్ధానాలు చేస్తున్నాయని..ఈ ధోరణి దేశ ఫ్రగతికి మంచిది కాదని హితవు పలికారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడం వరకు తప్పు లేదని, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఉచిత హమీలు అమలు చేయడం కోసం మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు. తాను ఉచితాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తారో వాటినే మ్యానిఫెస్టోలో పెట్టాలని, ఉచితాలపై రాజకీయ పార్టీలను ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితులు రావాలన్నారు. పార్టీ మారాలనుకునే నేతలు వారి పదవులకు రాజీనామాలు చేసి ఏ పార్టీలో చేరవచ్చన్నారు. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇటీవల ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్లడం రాజకీయ నాయకులకు ట్రెండ్‌గా మారిందని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. రాజకీయాల్లో, ప్రజాజీవితంలో అసభ్యంగా మాట్లాడేవారిని, అవినీతిపరులను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ప్రజాజీవితంలో కొనసాగే వారి భాషా, నడవడిక హుందాగా ఆదర్శనీయంగా ఉండేలా చూసుకోవాలన్నారు.

Exit mobile version